మాడ్గులపల్లి, డిసెంబర్ 27 : విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ భిక్షపతి సూచించారు. బుధవారం మండలంలోని అభంగాపురం ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొలిమెట్టు కార్యక్రమం ఆధారంగా విద్యార్థులు తరగతి వారీగా సామర్థ్యాలు కలిగి ఉండేలా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజువారీగా ఉపాధ్యాయ డైరీలు, అభ్యసన సామగ్రి, అభ్యసన కృత్యాలను అందుబాటులో ఉంచాలని, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయుడు నర్సయ్య పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : ప్రేమ, ఆప్యాయలతో ఆదరిస్తే అంగవైఖల్యాన్ని అధిగమించి సాధారణ విద్యార్థుల్లాగా మార్చుకోవచ్చని డీఈఓ భిక్షపతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న అభ్యసన కార్యక్రమాలను పరిశీలించి మాట్లాడారు. పిల్లలను ఆప్యాయంగా తగ్గరికి తీసుకొని వారి అవసరాలను గుర్తించి వాటిని అమలుచేస్తే వారు అంగవైకల్యాన్ని అధిగమిస్తారన్నారు. జిల్లాలో 34 భవిత కేంద్రాలు నిర్వహస్తున్నామని, వీటిలో 68మంది ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్లు పని చేస్తున్నారని, 2,278 మంది ప్రత్యేకావసరాలు గల పిల్లలు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ మాలోతు బాలాజీనాయక్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్లు బ్రహ్మచారి, జ్యోతి పాల్గొన్నారు.