రామగిరి, నవంబర్ 11: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యులర్ అండ్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 13 నుంచి డిసెంబర్ 1 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వర్సిటీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16, 827మంది విద్యార్థులు హాజరవుతుండగా 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు ఆన్లైన్ ప్రశ్నాపత్రంతోపాటు అందుకు సంబంధించి మెటీరియల్ను ఇప్పటికే కేంద్రాలకు సరఫరా చేశారు. అలాగే పరీక్షల నిర్వహణకు సిట్టింగ్ స్కాడ్తో పాటు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు.
పరీక్షల నిర్వహణకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 30 ( నల్లగొండ జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 9, యాదాద్రి భువనగిరి జిల్లాలో 9 ) కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 16, 827 మంది పరీక్షలకు హాజరవుతుండగా 1వ సెమిస్టర్లో 5400 మంది, 3వ సెమిస్టర్లో 5830, 5వ సెమిస్టర్లో 5597మంది హాజరు కానున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంజీయూ పరిధిలో నిర్వహించే డిగ్రీ సెమిస్టర్ 1, 3, 5 రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈనెల 13 నుంచి డిసెంబర్ 1వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని కేంద్రాలకు వీసీ పొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాలతో సిట్టింగ్ స్వాడ్, ఫ్లయింగ్ స్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. పరీక్షా కేంద్రాల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్ బాధ్యత వహంచాల్సి ఉంటుంది. విద్యార్థులకు సకాలంలో హాల్ టికెట్లు అందచేయాలని ఆదేశించాం.
– డా. ఉపేందర్రెడ్డి, సీవోఈ, ఎంజీయూ