గతేడాది వర్షాకాలంలో నాగార్జున సాగర్కు వరద భారీగా వచ్చింది. మూడు నెలలపాటు నిరంతరాయంగా గేట్ల ద్వారా సుమారు వెయ్యి టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో డ్యామ్ స్పిల్ వేపై గుంతలు ఏర్పడి భారీగా దెబ్బతిన్నది. దాంతో ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించి ఈ ఏడాది ఏప్రిల్లో మరమ్మతులు ప్రారంభించింది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. జూలై చివరి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆలస్యమైంది. ఆగస్టు మొదటి వారంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎన్ఎస్పీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
– హాలియా, జూలై 28
హాలియా, జూలై 29 : నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టు స్పిల్వే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. గతేడాది కృష్ణానదికి భారీ వరద రావడంతో సాగర్ డ్యాం స్పిల్వే కొనిచోట్ల దెబ్బతిన్నది. మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.19కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం జలాశయానికి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున స్పిల్వే పనుల్లో వేగం పెంచారు. మరో వా రం రోజుల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు.
1975 నుంచే స్పిల్ వే మరమ్మతులు
నాగార్జునసాగర్ డ్యాం స్పీల్ వే మరమ్మతులు 1975 నుంచే నిర్వహిస్తున్నారు. జలశయానికి భారీగా వరద నీరు వచ్చినప్పుడల్లా స్పిల్వే దెబ్బతింటూనే ఉంది. 2012లో స్పిల్వే భారీగా దెబ్బతిన్నది. డ్యాం స్పిల్వేకు ఎం60 కాంక్రీట్ వాడినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ సారి డ్యాం సాగర్ సిమెంట్ను వాడుతున్నారు.
పలుచోట్ల దెబ్బతిన్న స్పిల్వే…
కృష్ణానది పరివాహక ప్రాంతంలో గతేడాది కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది మూడు నెలల పాటు పరవళ్లు తొక్కింది. దీంతో నాగార్జునసాగర్ జలాశయానికి రోజుకు 5 నుంచి 7 లక్షల క్యూసెక్కుల మేర నీరు రావడంతో అధికారులు అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేశారు. మూడు నెలల పాటు నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగడంతో 26 గేట్లలో 20 గేట్ల కింద స్పీల్వే దెబ్బతినది. ముఖ్యంగా 11 చోట్ల 5మీటర్ల వెడల్పు 10 మీటర్ల లోతులో గుంతలు పడ్డాయి. డ్యాం స్పిల్వేను తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని ఎన్ఎస్పీ అధికారులతో పాటు డ్యాం నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సూచించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.20కోట్ల నిధులను విడుదల చేశారు. ఏప్రిల్ 24న డ్యాం పనులు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 80 శాతం మేర పూర్తయ్యాయి. ఈ నెల చివరి వరకు పనులు పూర్తి కావాల్సి ఉండగా.. వారం రోజులుగా ఎడతెలిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పనుల్లో ఆలస్యం జరిగింది. ఆగస్టు మొదటివారంలో పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
త్వరలోనే పనులు పూర్తి
నాగార్జునసాగర్ డ్యాం స్పిల్వే మరమ్మతులు పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాల్సి ఉండగా.. వానలతో పనులకు ఆటంకం కలిగింది.
– మల్లికార్జునరావు, ఎన్ఎస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్