బొడ్రాయిబజార్, జనవరి 23 : సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోవాలని దళిత సంఘాల నాయకులు, ప్రజలు డిమాండ్ చేశారు. దళిత మహిళా ప్రజాప్రతినిధిపై పెట్టిన అవిశ్వాసాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు, ఎమ్మార్పీఎస్, టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రైతుబజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 9వ వార్డు ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హసేన్, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తప్పెట్ల శ్రీరాములు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు చింతలపాటి చిన్న శ్రీరాములు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని నాగభూషణం మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై అవిశ్వాసం అగ్ర వర్గాల కుట్రపూరిత చర్య అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈ అవిశ్వాసాన్ని తిప్పి కొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దళిత మహిళపై అవిశ్వాసం పెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. సూర్యాపేటను శుభ్రం చేసేందుకు దళితులు కావాలి కానీ.. పీటంపై కూర్చునేందుకు పనికిరారా? అని ప్రశ్నించారు. జనరల్ స్థానంలో దళిత మహిళకు అవకాశం కల్పిస్తే జీర్ణించుకోలేని అగ్ర కులాల నాయకులు ఎలాగైనా దింపాలని పన్నాగాలు పన్నారని విమర్శించారు. 15శాతం ఉన్న అగ్ర కులాలు 85శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలను శాసిస్తామంటే ఊరుకునేది లేదని, ఐక్యంగా ఉండి దెబ్బకు దెబ్బ కొడుతామని హెచ్చరించారు.
దళిత చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాస్తారోకోతో ట్రాఫిక్కు అంతరాయం కలుగగా, పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బొల్లెద్దు దశరథ, గోపయ్య, బోడ శ్రీరాములు, పాలడుగు పరశురాం, దాసరి దేవయ్య, అఖిల్, వెంకన్న, రవి, నర్సయ్య, సందీప్యాదవ్, కౌసల్య, ఉప్పలమ్మ, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.