నల్లగొండ, జనవరి 19 : గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు నిధులు విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని దళిత బంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శాలిగౌరారం మండల లబ్ధిదారులతో కలిసి కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం భేషజాలకు పోకుండా, పార్టీల వైశమ్యాలను పకన పెట్టి దళిత బంధు గ్రౌండింగ్ చేపట్టాలన్నారు. ఎంపిక ప్రక్రియ మొత్తం పూర్తయిందని, నిధులను ఫ్రీజింగ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో 1050 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చారని, శాలిగౌరారం మండలంలో 270 మందిని ఎంపిక చేశారని తెలిపారు. ఎన్నికల కోడ్ రావడంతో గ్రౌండింగ్ ప్రక్రియ ఆగిపోయిందన్నారు.
కొత్త ప్రభుత్వం వేగవంతంగా గ్రౌండింగ్ చేసి నిధులను విడుదల చేయాలని కోరారు. పందుల సైదులు మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాల వలే దళిత బంధును కొనసాగించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు దళిత బంధు లబ్ధిదారులకు రూ.12 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే దళిత, బహుజన, ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మామిడి రమేశ్, ఏర్పుల నరేందర్, పోతెపాక నవీన్, బడుపుల శంకర్, యాకూబ్, రవీందర్, గణేశ్, వెంకట్, కిరణ్, ఎలీష, రవి, శంకర్, కమలాకర్ పాల్గొన్నారు.