యాదగిరిగుట్ట, ఆగస్టు 8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. మంగళవారం తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయం మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు.
స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సువర్ణ పుష్పార్చన జరిపారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. రాత్రి స్వామివారికి తిరువరాధన చేపట్టి అనంతరం తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా సాగాయి. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజను ఘనంగా నిర్వహించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. స్వామివారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. సుమారు 8 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.13,45,289 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ గీత తెలిపారు.
పవిత్ర శ్రావణమాసం సందర్భంగా లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయమైన పూర్వగిరి(పాతగుట్ట) లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకార అద్దాల మండపంలో శ్రావణ శుద్ధ దశమి శనివారం పవిత్రోత్సవాలకు అంకుకార్పణతో శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఉత్సవాలు ఆది, సోమవారం వరకు జరగనున్నాయి. మొదటిరోజు స్వస్తీవాచనం, విశ్వక్సేనుడికి శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహిస్తారు. రెండవ రోజు స్వామివారిని పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో ఆలంకరించి 108 నూలు ధారాలతో తయారు చేసిన పవిత్ర మాలలను పుణ్యజలాలతో సంప్రోక్షించి పూజలు చేస్తారు. మూడో రోజు ప్రధానాలయంలోని స్వయంభువులకు పవిత్రధారణ, యాగశాలలో మహాపూర్ణాహుతి హోమంతో ఉత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.
స్వామివారి సన్నిధిలో ఈ నెల 18 నుంచి సెప్టెంబర్ 14 వరకు శ్రావణమాస వేడుకలు జరుగనున్నాయి. శ్రావణ శుక్రవారాలైన ఈ నెల 18, 25, సెప్టెంబర్ 1, 8 తేదీల్లో ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహాలక్ష్మి, ఆండాళ్ అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించనున్నారు. రూ.2 వేల టిక్కెట్తో భక్తులను కుంకుమార్చనకు అనుమతించనున్నారు. శ్రావణమాసం పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 14వరకు స్వామివారికి అఖండ హరినామ సంకీర్తన నిర్వహించనున్నారు. శ్రావణమాసం చివరి శుక్రవారమైన సెప్టెంబర్ 8న ఉదయం 10 గంటలకు కొండకింద వ్రత మండపంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.