స్వామి వారికి రూ.12,76,971 ఆదాయం
యాదాద్రి, జూన్22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో బుధవారం స్వామి, అమ్మవార్లకు శాస్ర్తోక్తంగా నిత్యారాధనలను జరిపించారు. స్వయంభూ ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి నిత్య కల్యాణం చేపట్టారు. ముస్తాబు చేసిన గజవాహనంపై దేవేరులను పురవీధుల్లో ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు నిర్వహించారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి ప్రధానాలయ ప్రాకారంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణతంతు జరిపారు. మొదటగా స్వామివారికి సుదర్శన నారసింహహోమం చేపట్టారు. స్వామివారి నిత్యపూజలు వేకువజామున ప్రారంభమయ్యాయి. స్వయంభువులకు ఆరాధనలు జరిపి పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు నిర్వహించారు.
అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. సువర్ణపుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి సహస్రనామార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి సహస్ర నామార్చన నిర్వహించారు. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయం ప్రకారం జరిగాయి. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా చేపట్టారు. సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలు నిరాటకంగా కొనసాగాయి. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. శ్రీవారి ఖజానాకు బుధవారం రూ.12,76,971 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్. గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న గోవా ఎన్నికల కమిషనర్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని గోవా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్వీ. రమణమూర్తి బుధవారం సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. దర్శనానంతరం అద్దాల మండపం వద్ద అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు.