నల్లగొండ ప్రతినిధి, మార్చి 21 (నమస్తే తెలంగాణ) / సూర్యాపేట : ఇటీవల కురిసిన వడగండ్ల వానతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పొట్టదశలో ఉన్న వరి పంటతోపాటు మామిడి, నిమ్మ తోటలపై ఎక్కువ ప్రభావం పడింది. వరి నేలవాలడంతోపాటు పండ్ల తోటల్లో కాయలు, పండ్లు నేలరాలాయి. అకాలం వర్షం కారణంగా జరిగిన నష్టంతో రైతులు ఆందోళనలో ఉండగా, ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగి పంట నష్టాన్ని అంచనా వేసింది. నల్లగొండ జిల్లాలో 1,673 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 11,498 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 8,275 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా అధికారులు గుర్తించి, ప్రభుత్వానికి నివేదించింది. ఆత్మకూరు(ఎం)లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి , చిట్యాల మండలం సుంకెనపల్లిలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య క్షేత్రస్థాయిలో పర్యటించి బాధిత రైతులకు భరోసానిచ్చారు.
ఇటీవల కురిసిన వడగండ్ల వానతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 21,446 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లాలో 1,673 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 11,498 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 8,275 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా అధికారులు గుర్తించి, ప్రభుత్వానికి నివేదించారు.
నల్లగొండ జిల్లాలో
అధికారుల లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలో మొత్తం 1673 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లుగా అంచనా వేశారు. పంటల వారీగా తుది నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో జిల్లాలోని పలుచోట్ల వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో వర్షంతో పాటు కొన్నిచోట్ల భారీసైజు వడగండ్లు పడడంతో పంటలకు ఎక్కువగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలోని నల్లగొండ, మునుగోడు, నాగార్జునసాగర్, దేవరకొండ, నకిరేకల్ నియోజకవర్గాల పరిధిలో వర్ష ప్రభావం కనిపించింది. అయితే గుర్రంపోడు, మర్రిగూడ, నాంపల్లి, చిట్యాల, మునుగోడు తదితర మండలాల్లో వడగండ్లు సైతం కురిసాయి. అకాల వర్షంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారయంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించింది. స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. పంటల వారీగా జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.
అధికారుల లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లా పరిధిలో మొత్తం 1,673 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 888ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, మిర్చి తోటలకు కూడా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి, నిమ్మ, కాయలు రాలిపోయి, పుచ్చకాయలు పగిలిపోయి ఎక్కువ నష్టం వాటిల్లింది. ఇవన్నీ కలిపి 754 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేకంగా నివేదికలు సిద్ధం చేశారు. ఇందులో మిర్చి 90 ఎకరాల్లో, పుచ్చకాయ తోటలు 180 ఎకరాలు, మామిడి 125 ఎకరాలు, నిమ్మ 135 ఎకరాలు, కూరగాయల తోటలు 68 ఎకరాలు, బత్తాయి 115 ఎకరాలు, బొప్పడి 25 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. మొత్తం 387 మంది రైతులకు సంబంధించిన 745 ఎకరాల్లో పండ్ల తోటలు దెబ్బతినగా 47.70లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు తుది నివేదికను రూపొందించారు. ఇంకా ఇవి కాకుండా మొక్కజొన్న, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న లాంటి పంటలు మరో 40 ఎకరాల్లో దెబ్బతిన్నట్లుగా అధికారులు లెక్కలు వేశారు. వడగండ్లతో జరిగిన నష్టాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో
యాదాద్రిభువనగిరి జిల్లాలో మొత్తం 8,275 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను సేకరించారు. ఈ నెల 18న తొలి రోజు 40గ్రామాల్లో 2001మంది రైతులకు చెందిన 4,343ఎకరాలు, 19న 22గ్రామాల్లో 2,019మంది రైతులకు చెందిన 3,932 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తంగా 62గ్రామాల్లో 4020మంది రైతుల పంటలు నాశనమైనట్లు అధికారులు తేల్చారు. జిల్లాలోని ఆత్మకూరు (ఎం), గుండాల, అడ్డగూడూరు, మోత్కూరు, వలిగొండ, రాజాపేట, మోత్కూరు, రామన్నపేట, చౌటుప్పల్ మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా గుండాల మండలంలోని 9 గ్రామాల్లో 2,550ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇక్కడ 1400మంది రైతులు పంట నష్టపోయారు. అనంతరం చౌటుప్పల్ మండలంలో 1,717 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 1,341మంది రైతులు ఇబ్బందులపాలయ్యారు. ప్రధానంగా వరి పంట ఎక్కువగా నష్టం కాగా కొన్ని చోట్ల చిల్లీ, మామిడి, బొప్పాయ, పుచ్చకాయ, కూరగాయల సాగు పాడైంది. రామన్నపేటలో వెయ్యి ఎకరాలు, ఆత్మకూరు (ఎం)లో 911 ఎకరాలు, వలిగొండలో 632 ఎకరాలు, అడ్డగూడూరులో 600 ఎకరాలు, మోత్కూరులో 448ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
సూర్యాపేట జిల్లాలో
సూర్యాపేట జిల్లాలోని తుంగతూర్తి, తిరుమలగిరి మండలాల్లో 11,498 ఎకరాల్లో వరి పంట నష్టం వాటిల్లింది. తిరుమలిగిరి మండలంలోని 10 గ్రామాల్లో వడగండ్ల వాన పడింది. మామిడాల, జలాల్పురం వంటి గ్రామాల్లో వడగండ్ల వానకు వరి పూర్తిగా నేలవాలింది. ఈ మండలంలో దాదాపు 6,200 ఎకరాల్లో వరి పంట నష్టం వాటిందని అంచనా వేశారు. వరి పంట తరువాత అత్యధికంగా మామిడి తోటు నష్టం వాటిల్లింది. దాదాపు 1200ఎకరాల్లో మామిడి పంట నష్టం వాటిల్లింది.
50ఏండ్లలో ఇలాంటి వాన చూడలే
నా 50ఏండ్ల జీవితంలో ఇలాంటి వడగండ్ల వాన చూడలేదు. వరుసగా రెండు రోజులు గంట పాటు పెద్ద సైజు వడగండ్ల వర్షం కురువడంతో పదెకరాల్లో వరి పంట నష్టపోయింది. కొద్ది రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వర్షం భారీ నష్టం జరిగింది. వడగండ్ల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– యాస కృష్ణారెడ్డి, రైతు, ఆత్మకూరు(ఎం)
పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించాం
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జరిగిన పంట నష్టం వివరాలు సేకరించాలని ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్ర స్థాయిలో పరిశీలించగా నల్లగొండ జిల్లాలో 1673ఎకరాల్లో నష్టం జరిగినట్లు గుర్తించాం. ఆయా పంటలు 33శాతానికి మించిన నష్టం జరగడంతో బాధితుల పేర్లు, ఇతర వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాం. అందులో ఎక్కువగా వరి పైరే 888ఎకరాలు ఉంది. ప్రస్తుతం పైరు పొట్ట దశలో ఉన్నందున ఈ నష్టం జరిగింది. అయినా జిల్లాలో వర్షంతో పాటు గాలులు సైతం పెద్దగా లేనందున పాక్షిక నష్టమే జరిగింది.
–సుచరిత, డీఏఓ, నల్లగొండ