రామగిరి, డిసెంబర్ 3 : అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెక్కింపు పూర్తయ్యింది. నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అన్ని చోట్లా బీఆర్ఎస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. ఇక శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఈవీఎంలను నల్లగొండ పట్టణంలోని మేళ్లదుప్పలపల్లిలోని గోదాం వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరిచారు. ఆదివారం ఉదయమే కౌంటింగ్ సిబ్బంది కేంద్రానికి చేరుకున్నారు. పాస్లు ఉంటేనే లోపలికి అనుమతిచ్చారు. లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది.
ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేశారు.. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా ఈవీఎంలను లెక్కించారు. ఓట్లను లెక్కించేందుకు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేశారు. ఉదయం 11గంటలకే గెలుపోటములపై ఎలక్షన్ ట్రెండ్ స్పష్టత వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపుగా పూర్తి ఫలితాలు విడుదలయ్యాయి. కౌటింగ్లో దాదాపుగా 3,000 మంది సిబ్బంది పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలు (నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు) ఫలితాల్లో ఆరం భం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులే ముందు వరుసలో కనిపించారు. ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సా హం కనిపించింది. అయితే మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. చివరి రౌండ్ ఫలితం వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నల్లగొండ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నకిరేకల్ వేముల వీరేశం, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ జయవీర్రెడ్డి, దేవరకొండ బాలూనాయక్, మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గెలుపు పత్రాలను అధికారుల చేతుల మీదుగా స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కౌంటింగ్ సెంటర్ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు ఐదెంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రానికి మూడు కిలో మీటర్ల వరకు 144 సెక్షన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. సుమారు 350మంది పోలీసు బలగాలు విధులు నిర్వహించాయి. లెక్కింపు కేంద్రంలోకి సెల్ఫోన్లు, వాటర్బాటిళ్లు, సిగరెట్లు, మద్యం తదితర వస్తువులను అనుమతించలేదు. ఇక కౌంటింగ్ నేపథ్యంలో మద్యం దుకాణాలపై నిషేధం విధించారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు వైన్స్, బార్లు బంద్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో త్వరలో జిల్లాలో మరో ఉప ఎన్నిక రానుంది. ప్రస్తుతం వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన జనగాం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దాంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయక తప్పదు. దీంతో మూడు ఉమ్మడి జిల్లాకు మరో ఉప ఎన్నిక అనివార్యం కానుంది.