నీలగిరి, డిసెంబర్ 21 : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. రెండు వేరియంట్లకు మించి ప్రమాదకరంగా మూడో వేరియంట్ వస్తున్నది. తాజాగా కేరళలో జేఎన్-1 బీఏ 2.86 ఉపరకం పేరుతో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. అసలే శీతాకాలం కావడంతో మూడో వేరియంట్ ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఈ వేరియంట్తో ప్రజలు ఇబ్బంది పడకుండా మందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
గత రెండు వేరియంట్లతో జిల్లాలో 1,107 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ సీజన్లో అయ్యప్పమాలలు, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగ, వివిధ రకాల జాతరలు రానుండడంతో వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతోపాటు శానిటైజర్లు వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసేందుకు కిట్లతోపాటు శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
బీపీ, షుగర్, క్యాన్సర్ ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతే తప్ప బయటకి రాకూడదు. ముఖ్యంగా టీబీ, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు తప్పకుండా మాసులు ధరించాలి. చిన్నారులు, వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తకువగా ఉంటుంది కాబట్టి పౌష్టికాహారం తీసుకోవాలి. కేరళ నుంచి వచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణమైనా నూతన వేరియంట్ వ్యాపించే అవకాశం ఉంది. రద్దీ ప్రదేశాల్లో సాధ్యమైనంతవరకు తిరుగకుండా ఉండాలి. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి.
-డాక్టర్ అన్నీమళ్ల కొండల్రావు, డీఎంహెచ్ఓ, నల్లగొండ
కరోనాతో గతంలో రెండుసార్లు ప్రజలు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఈ వైరస్ నాటి రోజులు కండ్ల ముందు కదలాడుతుండగానే మరోసారి ప్రమాదకరమైన వైరస్ రిటర్న్ అయింది. ఏడాది నుంచి తన ప్రభావం చూపని కొవిడ్ మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తున్నది. గతంలో రెండు దఫాలుగా కరోనా చూపిన ప్రభావంతో వేలాది మంది మృత్యువాత పడగా, అంతుకు మించిన సంఖ్యలో ప్రజలు దవాఖానల పాలయ్యారు. ఫలితంగా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్న క్రమంలో మరోమారు కరోనా హెచ్చరికలు రావడంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తున్నది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దాంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
తద్వారా ఊపిరితిత్తులు ఇన్స్పెక్షన్కు గురై ప్రాణాపాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో చలి తీవ్రత అధికంగానే ఉంది. దాంతో మనుషులపై అధిక ప్రభావం చూపించనున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందిగా వైద్యాధికారులు పేరొంటున్నారు. అయ్యప్పమాలలు, ధనుర్వాస పూజలు, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకలకు తోడు కొత్త సినిమాల విడుదల, వివిధ జాతరలు జన సామర్థ్యం పెంచేవే కావడం గమనార్హం. కరోనా వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఇప్పటికే ప్రజలందరికీ ఈ వైరస్పై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. ఈ ప్రమాదకర వైరస్తో ఇతర అనారోగ్య సమస్యలనూ ఇప్పటికే చాలా మంది అనుమభవిస్తున్నారు.
ఈ వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా రెండుసార్లు వ్యాక్సినేషన్తోపాటు బూస్టర్ డోస్ను కూడా అందించింది. అలాగే కరోనా పరీక్షలు నిర్వహించింది. గతంలో జిల్లాలోని అన్ని దవాఖానల్లో చికిత్సలు కూడా అందించింది. ప్రస్తుతం అన్ని దవాఖానల్లో బెడ్లను అందుబాటులో ఉంచడంతోపాటు ఆర్టీపీసీఆర్ కిట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో శాంపిళ్లు అందించాలని వైద్యాధికారులు చెబుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వెంటనే శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు తగిన చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది.