– ప్రజాస్వామ్యం గొంతు నొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం
– మహిళా ఎమ్మెల్యేలపై భౌతిక దాడులు అమానుషం
– అరెస్టులు చేయడం సర్వ భ్రష్టత్వానికి నిదర్శనం
– దాడి చేసిన పోలీసులను విధుల నుండి తొలగించాలి
– ప్రభుత్వ పెద్దలు క్షమాపణలు చెప్పాలి
– కోదాడలో గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా
కోదాడ, సెప్టెంబర్ 07 : అసెంబ్లీ గేటు బయట బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై పోలీసులు అమానుషంగా దాడి చేసి అరెస్టు చేయడం దుర్మార్గమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ గేటు బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులకు నిరసనగా సోమవారం కోదాడ ప్రధాన రహదారిపై గల గాంధీ విగ్రహం ఎదుట ఆయన పార్టీ శ్రేణులతో కలిసి నిరసన, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో పోలీసు రాజ్యం కొనసాగుతుందని, ప్రజాస్వామ్యం అడుగంటి పోయిందన్నారు. మహిళా ఎమ్మెల్యేలనే గౌరవం లేకుండా సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై అమానవీయంగా దాడి చేయడం దుర్మార్గమన్నారు.
ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే ఈ దుశ్చర్య జరిగిందన్నారు. ఇది గౌరవ సభ కాదని కౌరవ సభ అని విమర్శించారు. భౌతిక దాడులకు పాల్పడిన పోలీసులను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, జరుగుతున్న దుష్పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తాలేక ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధులపై దాష్టీకాన్ని ప్రదర్శించడం శోచనీయమన్నారు. అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ దుర్ఘటనకు ముఖ్యమంత్రి, మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పార్టీ నాయకులు ఎస్కే నయీమ్, చీమ నరేష్, ఉపేందర్ గౌడ్, చలిగంటి వెంకట్, మల్లయ్య గౌడ్, అబూ, కరిముల్లా, బాబా, బత్తుల ఉపేందర్, భాగ్యమ్మ, మజార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

గౌరవ సభ కాదు కౌరవ సభ : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్