గుర్రంపోడు, ఆగస్టు 04 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం గుర్రంపోడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను మోసగించడానికి నిరసిస్తూ తాసీల్దార్ కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మాట్లాడుతూ.. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 100 రోజులు ఆరు గ్యారెంటీల తో పాటు 420 హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా ఇప్పటికీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు నెలకు 2,500 చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పటికీ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ ఖాతాలో కూడా రూ.2,500 జమ చేసిన దాఖలాలు లేవని తెలిపారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉన్న లక్ష ఇరవై వేల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున 33 నెలలకు గాను రూ.82,500 ఈ ప్రభుత్వం బాకీ పడిందన్నారు. తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు నెలకు రూ.4 వేల పాయల పింఛన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఏ అవ్వ తాత కూడా నెలకు రూ.4000 చొప్పున పింఛన్ ఇవ్వడం లేదన్నారు. గత 33 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు రూ.66 వేల బాకీ పడిందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద కేసీఆర్ ఇస్తున్న లక్ష 116 రూపాయలతో పాటు తాము అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు కానీ రాష్ట్రంలో కానీ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కానీ ఇప్పటివరకు ఏ ఒక్క మహిళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం ఇవ్వలేదని దుయ్యబట్టారు.
కేసీఆర్ కిట్టు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇది దగా కోరు ప్రభుత్వమని పేర్కొన్నాడు. తాము అధికారంలోకి వస్తే మహిళలను లక్ష అధికారులను చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇస్తే మహిళలు నమ్మి ఓటేసి గెలిపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టుగానే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలను కూడా మోసం చేసిందని మహిళా సంక్షేమానికి మొండి చేయి చూపుతుందని విమర్శించారు. మహిళలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఈరోజు రాష్ట్రంలోని మహిళలంతా బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ రాంచందర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.