సూర్యాపేట, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసానికి మద్దతు తెలుపలేదని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావనీకృపాకర్ ఇంటిపై కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీకి చెందిన అసమ్మతి కౌన్సిలర్లు ఆదివారం దాడికి పాల్పడ్డారు. ఇంటిపై గుడ్లు, రాళ్లు విసురుతూ దౌర్జన్యానికి తెగబడ్డారు. విషయం తెలుసుకొని నిలువరించేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి రావడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. ఈ దాడిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వై.వెంకటేశ్వర్లు డ్రెస్ చినికిపోగా, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, ఆమె వెంట ఉన్న అనుములపురి భానుకు స్వల్ప గాయాలయ్యాయి.
అలాగే బీఆర్ఎస్లో ఉండి చైర్మన్ పదవి కోసం ఇతర పార్టీలతో జతకట్టిన కొండపల్లి నిఖిలకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో సూర్యాపేటలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఘర్షణ జరుగకుండా చర్యలు తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన 32 మందిలో చాలా మంది ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మూడు నుంచి నాలుగు సార్లు మారిన వారు ఉన్నారు. అయితే అవిశ్వాసం వీగిపోవడానికి గండూరి పావనీకృపాకర్ కారణమని కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ వర్గాలు దౌర్జన్యానికి పాల్పడ్డాయి. బీఆర్ఎస్ నాయకులు అక్కడికి రావడం ఆలస్యమైతే పరిస్థితి భయానకంగానే మారి ఉండేదని బాధితులు తెలిపారు. అనంతరం ఇరువర్గాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి.