సూర్యాపేట, జనవరి 3 : వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల శాసన మండలి స్థానానికి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయని, అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 2023 నాటికి డిగ్రీ పూర్తయి మూడు సంవత్సరాలు నిండిన పట్టభద్రులు ఫామ్ 18 ద్వారా ఓటుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలని సూచించారు. ఓటు నమోదు ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనాలని కోరారు. ఓటర్ల నమోదు దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 6వరకు గడువు ఉన్నదని తెలిపారు. ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితా విడుదల, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 14 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. మార్చి 29 వరకు అభ్యంతరాల పరిష్కారం, ఏప్రిల్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో నాయకులు చకిలం రాజేశ్వర్రావు, సత్యనారాయణ, అబిద్, గోపి పాల్గొన్నారు.