సూర్యాపేట, జనవరి 18 : గ్రామపంచాయతీలు, మండలాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో గురువారం వెబ్ ఎక్స్ ద్వారా మాట్లాడారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్వారా వివిధ పథకాలకు వచ్చే నిధుల సమాచారాన్ని సమగ్రంగా తయారు చేసి వాటితో చేయాల్సిన అభివృద్ధి పనులకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు.
మండల స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో మండల పరిషత్ కార్యాలయంలో శనివారం శిక్షణ నిర్వహించాలని సూచించారు. గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ఈ నెల 20న మొదటి గ్రామ సభ, 25న రెండో గ్రామ సభ నిర్వహించి ఈ నెల 27నాటికి ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ నెల 31లోగా అన్ని పూర్తి చేసి మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించి మండల ప్రణాళికలకు ఆమోదం తెలుపాలని పేర్కొన్నారు.
నిర్ణీత వ్యవధిలో అన్ని ఆమోదాలు తెలుపుకొని ఫిబ్రవరి 6వ తేదీలోపు సంబంధిత ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో అప్లోడ్ చేసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ఈ నెల చివరి వరకు గ్రామాల్లో వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ సురేశ్, డీఆర్డీఓ కిరణ్కుమార్, డీపీఓ యాదయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.