సూర్యాపేట, ఏప్రిల్ 1 : ఎన్నికల విధులు, బాధ్యతలు సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. సోమవారం సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పీఓ, ఏపీఓలకు స్థానిక ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పీఓ, ఏపీఓలకు ఎన్నికల రోజున నిర్వహించే విధి విధానాలపై రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని చెప్పారు. నాలుగు నియోజకవర్గాల పరిధిలో 1,416 మంది పీఓలు, ఏపీఓలకు గాను మొదటి రోజు 1,188 మంది సిబ్బంది శిక్షణ కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పారు. మొదటి రోజు హాజరు కాని 228 మంది సిబ్బంది రెండో రోజు శిక్షణ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాదవ్, తాసీల్దార్ శ్యామ్సుందర్రెడ్డి, డీఏఓ శ్రీధర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.