సూర్యాపేట, జనవరి 8 : ఈ నెల 25 నుంచి పాలకవీడు మండలం జాన్పహాడ్ లో ఉర్సు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి ఉత్సవాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 25 నుంచి 28 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉర్సుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆ దిశగా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఉర్సు నిర్వహణకు హుజూర్నగర్ ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. దర్గా ఆవరణలో పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. పార్కింగ్, తాగునీరు, విద్యుత్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. భక్తులకు సరిపడా బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రానున్నందున వారికి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఉర్సును విజయవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, జడ్పీ సీఈఓ సురేశ్కుమార్, డీపీఓ యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.