సూర్యాపేట, డిసెంబర్ 22 : ప్రత్యేక ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2024 జనవరి 1నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలన్నారు. 2024 జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లు చెప్పారు. ముసాయిదాపై జనవరి 22 వరకు అభ్యంతరాలు అందజేయవచ్చన్నారు. ఫిబ్రవరి 8న తుది ఓటర్ల జాబితా ప్రకటిచడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో వేర్వేరు చోట్ల రెండు ఓట్లు కలిగిన వారి ఓట్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని రాజారామ్ కళాశాలలోని పోలింగ్ కేంద్రం-109 ఓటర్లకు అనుకూలంగా లేదని, దానిని సాహితి స్కూల్కు మార్చాలని రాజకీయా పార్టీల ప్రతినిధులు కోరగా ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పెన్పహాడ్ మండలం చీదెళ్లలో కొంతమంది ఓటర్లు ఓటరు జాబితాలో నమోదు కాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా విచారణ చేయాలని సూర్యాపేట ఆర్డీఓను ఆదేశించారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు చకిలం రాజేశ్వర్రావు, అబిద్, రవి, స్టాలిన్, కరుణాకర్రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.