నల్లగొండ, ఫిబ్రవరి 16 : రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాములో నిర్వహిస్తున్న ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీని కలెక్టర్ హరిచందన దాసరి శుక్రవా రం తనిఖీ చేశారు. ఈ నెల 5 నుంచి నిర్వహిస్తున్న ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ నేపథ్యం లో కలెక్టర్ పర్యవేక్షణలో 20 మంది ఈసీఐఎల్ ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం 5 శాతం ఈవీఎంల మాక్ పోలింగ్ సైతం నిర్వహించారు.
జిల్లాలో 4,222 బ్యాలెట్ యూనిట్లు, 2,296 కంట్రోల్ యూనిట్లు, 2,784 వీవీ ప్యాట్లు ఉండగా వీటన్నింటికీ మొదటి స్థాయి తనిఖీ చేశారు.
ఇందులో 4,072 బ్యాలెట్ యూనిట్లు, 2,291 కంట్రోల్ యూనిట్లు, 2,779 వీవీ ప్యాట్లు ఎన్నికల నిర్వహణకు ఉన్నాయని, మిగిలినవి ఈసీఐఎల్కు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్.అశోక్, బీఆర్ఎస్ నుంచి బి పిచ్చయ్య, సీపీఐ(ఎం) పి. నర్సిరెడ్డి, బీఎస్పీ కె. కాన్షిరామ్, ఎస్కే చాంద్ పాషా, బీజేపీ పి. లింగస్వామి, టీడీపీ నుంచి మల్లికార్జున్ పాల్గొన్నారు.