భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 10 : ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియకు అందరూ సహకరించాలని, నామినేషన్ల దాఖలు సమయంలో నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కె.జెండగే వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేయదలచుకున్న వారు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలను వివరించారు.
కలెక్టరేట్లో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఏర్పాటు చేశామని, ఈ నెల 18 నుంచి సదరు కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 25 వరకు సెలవు రోజు, ఆదివారం మినహా అన్ని పని దినాల్లో నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. నిర్ణీత గడువులోపు రిటర్నింగ్ అధికారి వద్దకు చేరుకున్న వారి నామినేషన్ ఫారాలు మాత్రమే స్వీకరిస్తారని స్పష్టం చేశారు. నామినేషన్ల సెక్యూరిటీ డిపాజిట్ కింద జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన వారు రూ. 12,500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, అభ్యర్థి వెంట నలుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తారని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల వరకు 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేసే నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదిస్తే సరిపోతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందినవారేతే తప్పనిసరిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ ఏఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని స్పష్టం చేశారు.
పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంక్ అకౌంట్ తెరువాలని, దీని ద్వారానే ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తూ పకాగా రికార్డులు నిర్వహించాలని సూచించారు. అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని, సంబంధిత బ్యాంక్ అకౌంట్ లావాదేవీల ఆధారంగానే అభ్యర్థుల వ్యయాన్ని లెక్కిస్తారని తెలిపారు. అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే నామినేషన్ పత్రంలో వివరాలను పొందుపర్చాలన్నారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థి, లేదా ప్రతిపాదించిన వారే స్వయంగా హాజరై నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని, ఆర్ఓ సమక్షంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులకు సహాయపడేందుకు ఆర్ఓ కార్యాలయం వద్ద హెల్ప్ డెస్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రచారసభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తుగానే సువిధ ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలన్నారు.
కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ముంద్రించే విషయంలో ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 127 సూచనలు పాటించాలని సూచించారు. ప్రచార కార్యక్రమాలు, ఎల్ఈడీ వాహనాలు, హెలీప్యాడ్, హెలికాప్టర్ వంటి వాటికి ఆర్ఓ కార్యాలయం నుంచి అనుమతి పొందాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి. బెన్ షాలోమ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె.గంగాధర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బట్టు రామచంద్రయ్య, బట్టుపల్లి అనూరాధ, కూర వెంకటేశ్, సోమ రవీందర్రెడ్డి, ముల్తాన్షా, రచ్చ శ్రీనివాస్రెడ్డి, రత్నపురం బలరాం, ఎదుగాని సంతోశ్ పాల్గొన్నారు.