నల్లగొండ రూరల్, మార్చి 17 : కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో శనివారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, విధిగా ఎన్నికల నియమావళిని పాటించాలని కలెక్టర్ దాసరి హరిందన ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ఎన్నికల షెడ్యూల్ను తెలియజేస్తూ ఏప్రిల్ 18న పార్లమెంట్ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు. ఏప్రిల్ 25న నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉప సంహరణ, మే 13న పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 1,766 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 46 ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు చెప్పారు. 30 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు, 30 మహిళా పోలింగ్ కేంద్రాలు , 6 యూల్ పోలింగ్ కేంద్రాలు, మరో 6 సీడబ్ల్యూడీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 14.9 లక్షల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 7.36 లక్షలు పురుషులు, 7.54 లక్షలు మహిళా ఓటర్లు ఉన్నారని, కొత్తగా 52,000 మంది ఓటర్లు నమోదయ్యారని వివరించారు. ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సి-విజిల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని, ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని సూచించారు. ఎన్నికల సందర్భంగా సీసీ కెమెరాలు పెంచామని, ఎవరు ఎవరినీ మోసం చేయొద్దని, ఒక వేళ అలాంటివి తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఆర్ఓ రాజ్యలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, సమాచార శాఖ సహాయ సంచాలకుడు వెంకటేశ్వర్లు, మీడి యా రిలేషన్స్ నోడల్ అధికారి, ఇండస్ట్రీస్ జీఎం కోటేశ్వర్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.