నీలగిరి, ఫిబ్రవరి 20: పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లర్లు, వాణిజ్య బ్యాంకులు సామాజిక బాధ్యతగా జిల్లా అభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, సంక్షేమ రంగాల్లో పేదలకు సహకారం అందించాలన్నారు. జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసినందున ఆ కమిటీ ఆమోదంతో అవసరమైన రంగాల్లో, అవసరమైన చోట ఆర్థిక సహకారం అందించాలన్నారు. పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలు, బ్యాంకర్లు, రైస్ మిల్లర్లు అంగీకరించడంతో పాటు కలెక్టర్ చర్యకు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీశ్, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, రైస్ మిల్లర్లు, బ్యాంకు నియంత్రణ అధికారులు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 20: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మేకల అభినవ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలను వారు ప్రారంభించారు. అనంతరం శాంతి సామరస్యానికి చిహ్నంగా పావురాలను ఎగరేశారు. రంగురంగుల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామీణస్థాయి నుంచి విద్యార్థులను గుర్తించి తోడ్పడటమే సీఎం కప్ పోటీల ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి అక్బర్ అలీ, జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు.