సూర్యాపేట, జనవరి 9 : ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు 2022-23 వానకాలం సీఎంఆర్ అందించాలని సూర్యాపేట కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డితో కలిసి కస్టమ్ మిల్లింగ్ రైస్పై సివిల్ సప్లయ్ అధికారులు, మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ అందించడంలో మిల్లర్లు నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ఈ నెల 30వరకు ప్రభుత్వం గడువు విధించిందని, ఈ లోపు పెండింగ్ బియ్యం ఎఫ్సీఐకి అందించాలని సూచించారు. 2022-23 వానకాలం సీజన్కు సంబంధించి సుమారు 2,10,261.654 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,63,341.070 మెట్రిక్ టన్నులు ఎఫ్సీఐకి అందిందని చెప్పారు. ఇంకా 41,920.584 మెట్రిక్ టన్నుల రైస్ అందించాల్సి ఉన్నదని తెలిపారు. ఈ నెల 30 నాటికి బియ్యం ఇవ్వని మిల్లులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 8 మిల్లుల్లో పెండింగ్ అధికంగా ఉన్నదని, వాటిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎస్ఓ మోహన్బాబు, సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతినాయక్, మిల్లర్లు పాల్గొన్నారు.
దేవాదుల భూసేకరణ వేగవంతం చేయాలి
దేవాదుల ప్రాజెక్టు కాల్వలకు సబంధించి తిరుమలగిరి, నాగారం మండలాల్లో భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో భూ సేకరణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. తిరుమలగిరి, నాగారం మండలాల పరిధిలో కాల్వల తవ్వకాల కోసం 180 ఎకరాల భూమిని సర్వే చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ల్యాండ్ సర్వే రికార్డుల
ఏడీ నాగేందర్, దేవాదుల ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్, డీఏఓ శ్రీలత, ఆయా మండలాల తాసీల్దార్లు పాల్గొన్నారు.