నీలగిరి, మే 2 ;పారిశుధ్య నిర్వహణకు అంకితమై నిత్యం స్వచ్ఛ సమాజానికి పాటుపడుతున్న సఫాయి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన పారిశుధ్య కార్మికులకు ఎకప్పటికప్పుడు వేతన భరోసాను అందిస్తున్నది. స్వరాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల వేతనం రెండున్నర రెట్లు పెరుగగా, గతంలో అరకొర జీతాలతో నెట్టుకొచ్చిన పంచాయతీల కార్మికులకు 2019 నూతన పంచాయతీ చట్టంతో నెలనెలా మంచి వేతనం అందుతున్నది. తాజాగా మేడే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వెయ్యి రూపాయల వేతన పెంపుతో మున్సిపల్ కార్మికుల వేతనం 16,600, గ్రామపంచాయతీ కార్మికుల వేతనం రూ.9,500కి పెరిగింది. సర్కారు భరోసాతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా9,515 కార్మికుల ఇండల్లో సంతోషం వెల్లివిరిస్తున్నది. పారిశుధ్య కార్మికులు మంగళవారం పలుచోట్ల సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలందరి ఆరోగ్యం కోసం అనునిత్యం చెత్త, మురుగుతో సహవాసం చేసే పారిశుధ్య కార్మికులకు స్వరాష్ట్రంలో గుర్తింపు లభించింది. సీఎం కేసీఆర్ వారి శ్రమకు తగిన గౌరవం కల్పిస్తున్నారు. 2014 సంవత్సరం నుంచి వేతనాలు పెంచుతూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. అందరికీ నెలనెలా బ్యాంక్ ఖాతాల ద్వారా వేతనాలు అందుతుండగా పీఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొవిడ్ సమయంలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివి. ముఖ్యమంత్రి కేసీఆర్ కొవిడ్ భృతి కింద ప్రతి కార్మికుడికి రూ.5వేలు ఇచ్చి అండగా నిలబడ్డారు.
పంచాయతీ కార్మికులకు గౌరవం
గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు గతంలో కనీస వేతనం అనేది లేదు. కేవలం కూలీ పని ఇచ్చేవారు. జనాభాను బట్టి రూ.1500 నుంచి రూ.2వేల వరకు ఇచ్చేవారు. 2019 సెప్టెంబర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన పంచాయతీ చట్టంతో పంచాయతీ కార్మికులకు మల్టీ పర్పస్ వర్కర్లుగా గుర్తించారు. అంతే కాకుండా వారికి నెలనెలా రూ.8,500 వేతనం ఇస్తున్నారు. వారికి సీఎం కేసీఆర్ మేడే కానుకగా వెయ్యి రూపాయలు పెంచడంతో రూ.9,500కి చేరింది.
భారీగా పెరిగిన వేతనం
మున్సిపాలిటీ కార్మికులకు 2014లో రూ.6,700 వేతనం ఉండగా 2016లో రూ.8,300, 2018లో 12,000, 2021లో రూ.15,600కు పెరిగింది. తాజాగా మేడే రోజున సీఎం కేసీఆర్ రూ.వెయ్యి పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో వారి వేతనం రూ.16,600కు చేరింది.
పారిశుధ్యంలో కీలక పాత్ర
స్వచ్ఛ పట్టణాలు, పల్లెల కోసం పారిశుధ్య కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. పల్లె ప్రగతి అమలుతోపాటు పారిశుధ్య నిర్వహణలో మన పల్లెలు, పట్టణాలు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాయి. తమ శ్రమను గుర్తించి అడుగక ముందే వేతనాలు పెంచడంపై పారిశుధ్య కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని మరోమారు రుజువు చేశారని కొనియాడుతున్నారు.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
చౌటుప్పల్/కోదాడటౌన్, మే2 : మేడే కానుకగా వెయ్యి రూపాయల వేతనం పెంచడంపై పారిశుధ్య కార్మికులకు హర్షం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పారిశుధ్య కార్మికులు మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజుతో కలిసి క్షీరాభిషేకం చేశారు.
కోదాడలో..
కోదాడ మున్సిపల్ కార్యాలయంలో కూడా పారిశుధ్య కార్మికులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్, మున్సిపల్ కార్మిక విభాగం అధ్యక్షులు కొమ్ము నాగేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి కుడుముల గోపి, కర్ల ప్రసాద్, వెంకటేశ్వర్లు, వీరేశం, దాసు, దొంగరి శ్రీను, నాగరాజు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులను మనుషులుగా గుర్తించిండు
నేను 22 సంవత్సరాలుగా సూర్యాపేట మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నా. ఇన్నేండ్ల కాలంలో మున్సిపల్ కార్మికులను చీదరించుకున్న వారే ఉన్నారు గానీ మనుషులుగా చూడలేదు. తెలంగాణ రా్రష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. మమ్మల్ని మనుషులుగా గుర్తించి వేతనాలు పెంచుతున్నాడు. ఆనందంగా ఉంది.
–గట్టు నరేశ్, పారిశుధ్య కార్మికుడు, సూర్యాపేట
అండగా నిలబడింది కేసీఆర్ సారే
పట్టణాల్లో పని చేసే మా కష్ట సుఖాలు సీఎం కేసీఆర్కు తెలుసు. ఉద్యమ నాయకుడిగా ఉన్న ఆయన పేదలు, కార్మికులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు రెండు సార్లు జీతాలు పెరిగాయి. చాలా సంతోషంగా ఉంది.
–కత్తుల భాస్కర్, పారిశుధ్య కార్మికుడు, నల్లగొండ మున్సిపాలిటీ
మా శ్రమకు ఫలితం దకింది
పట్టణాలను శుభ్రంగా చేయడంలో మేము పడుతున్న కష్టాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారు. మేడే కానుకగా వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచడం సంతోషంగా ఉంది. మా శ్రమకు ఫలితం దకింది. సీఎం కేసీఆర్ మేలు మరువలేం.
–తోరకొప్పుల పరమేశ్, నల్లగొండ మున్సిపాలిటీ, పారిశుద్య కార్మికుడు
తెలంగాణ వచ్చినంక సంతోషంగా ఉన్నాం..
నేను 30 సంవత్సరాల నుంచి పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నాం. గతంలో తక్కు వేతనంతో పూటగడువక చాలా ఇబ్బంది పడ్డాం. సీఎం కేసీఆర్ వచ్చినంకనే జీతాలు పెరిగినయి. ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ మేలును మరిచిపోలేం.
– పొట్ట తారమ్మ, పారిశుధ్య కార్మికురాలు, దేవరకొండ మున్సిపాలిటీ
సూర్యాపేట జిల్లాలో 3,051 మంది..
జిల్లాలోని సూర్యాపేట మున్సిపాలిటీలో 560, కోదాడలో 315, హుజూర్నగర్లో 50, నేరేడుచర్లలో 33, తిరుమలగిరిలో 66 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీల్లో 2,027 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు.
నల్లగొండ జిల్లాలో 4,153 మంది..
నల్లగొండ జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో 1513 మంది, 844 గ్రామ పంచాయతీల్లో 2,640 మంది పంచాయతీ కార్మికులు పని చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,311 మంది
యాదాద్రి భువనగిరి జిల్లాలో 421 గ్రామ పంచాయతీల్లో 1875 మంది, 6 మున్సిపాలిటీల్లో 436 మంది( భువనగిరిలో 200, ఆలేరులో 42, యాదగిరిగుట్టలో 46, మోత్కూరులో 40, భూదాన్పోచంపల్లిలో 32, చౌటుప్పల్లో 76) పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు.