హాలియా, నవంబర్ 13 ; అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం హాలియాకు రానున్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సాగర్ నియోజకవర్గ ప్రజా ఆశ్వీరాద సభలో ప్రసంగించనున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. ముఖ్యమంత్రిని చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సభా వేదిక ఏర్పాట్లను ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్నాయక్, పార్టీ నాయకులు సోమవారం పర్యవేక్షించారు.హెలిప్యాడ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు పరిశీలించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు హాలియాకు రానున్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజా ఆశ్వీరాద సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సీఎం బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హాలియా-దేవరకొండ ప్రధాన రహదారి వెంట అనుముల గ్రామంలో 10 ఎకరాల స్థలాన్ని జేసీబీలు, డోజర్లతో శుభ్రం చేయడంతోపాటు సభకు వచ్చిన ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు ఇబ్బంది కలుగకుండా మరో 10 ఎకరాలను కూడా శుభ్రం చేయించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బహిరంగ సభ జరుగనున్నందున సభకు హాజరయ్యే మహిళలు, వృద్ధులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేశారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి పరిశీలించారు.
హాజరుకానున్న సుమారు లక్ష మంది..
2018 శాసనసభ ఎన్నికలతోపాటు 2021లో జరిగిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారు. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బంజారా భవన్ ఏర్పాటు, నాగార్జునసాగర్ ఎన్ఎస్పీ క్వాటర్స్లో నివాసం ఉంటున్న వారికే క్వాటర్స్ కేటాయింపు, నందికొండ మున్సిపాలిటీగా ఏర్పాటు, నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.150 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా ఇప్పటికే నెల్లికల్ లిఫ్ట్ నిర్మాణానికి రూ.684 కోట్లును ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు యుద్ధప్రాతిపాదికన జరుగుతున్నాయి. తమ అభిమాన నాయకుడు కేసీఆర్ను చూసేందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజలు సైతం స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశం ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాలు, 2 మున్సిపాలిటీల నుంచి సుమారు లక్ష మంది వరకు తరలివచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సభతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరింత పుంజుకునే అవకాశం ఉంది. వారి వెంట జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, ఎంపీపీలు సుమతీపురుషోత్తం, ఆంగోతు భగవాన్నాయక్, రాష్ట్ర కార్యదర్శి బోల్లేపల్లి శ్రీనివాసరావు, పట్టణాధ్యక్షుడు వడ్డె సతీశ్రెడ్డి, మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, నాయకుడు కట్టెబోయిన గురువయ్య ఉన్నారు.
పరిశీలించిన అధికారులు..
సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో అధికారులు సభకు 300 మీటర్ల దూరంలో హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ పనులను సోమవారం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా సభకు అర కిలోమీటర్ దూరంలో ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎవరైనా మరచిపోయి చెయ్యి గుర్తుకు ఓటేస్తే అది మోరీలో వేసినట్లేనని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితో కలిసి హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామంలో మంగళవారం జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 40 ఏండ్లుగా జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ అధికారంలోనికి వచ్చాక దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఆయన కుమారుడు ప్రస్తుల ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. నేడు హాలియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఉన్నందున, తమ అభిమాన నాయకుడు , ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. జానారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా ఉండి ఏమీ చేయలేదని, నోముల భగత్ రెండున్నరేండ్లలోనే ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. రూ.650 కోట్లతో నెల్లికల్ లిఫ్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జానారెడ్డికి అధికార దాహం, పదవీ వ్యామోహం తప్పా ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో 15మంది ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని, అదే బీఆర్ఎస్లో సీఎం అభ్యర్థి కేసీఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు. ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే నోముల భగత్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.