ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించాల్సిన భవనాలు సిద్ధమయ్యాయి. సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ మార్కెట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలు గ్రీనరీ, లైటింగ్ ఏర్పాట్లతో తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ప్రారంభోత్సవాల అనంతరం వ్యవసాయ మార్కెట్ పక్కన నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లు కూడా పూర్తి కావొచ్చాయి. నూతన భవనాలను, సభ ఏర్పాట్లను శుక్రవారం మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సభాస్థలి వద్దే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ సౌకర్యాలు, బందోబస్తుపై అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు.
– సూర్యాపేట, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ)
బొడ్రాయిబజార్, ఆగస్టు 17 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.30కోట్లతో 2.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ ఉత్పత్తుల రైతుల మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత మార్కెట్ యార్డుల అభివృద్ధ్దికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషితో దేశంలోనే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. రూ.30కోట్లతో ఆరెకరాల్లో 5బ్లాకులుగా నిర్మించిన ఈ మార్కెట్లో మొత్తం 211 దుకాణాలు ఉన్నాయి. రైతుల కోసం ఒక బ్యాంకు, బాంకెట్ హాల్, ఏటీఎం, క్యాంటిన్ను ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్ యార్డు భవనంలో మంత్రి జగదీశ్రెడ్డి ఆలోచన విధానంతో జర్మన్ టెక్నాలజీతో 10ఎంఎం మందం యూవీ ఆల్ట్రావాయిలెట్ ఫిల్టర్ డూమ్ను స్కైలైట్గా ఏర్పాటు చేశారు.
సన్లైట్ పైపులు, ప్రత్యేక లేజర్ బ్లో పైపు ద్వారా ప్రతి దుకాణంలో రోజుకు 9నుంచి 10గంటల పాటు పగటి వెలుగులు ప్రతి దుకాణంలో ప్రసరించేలా దేశంలో మొట్ట మొదటిసారిగా ఈ మార్కెట్లో ఏర్పాటు చేయడం విశేషం. స్కై లైట్ వద్ద విద్యుత్ దీపాలతో పని లేకుండా సహజ కాంతి పడేలా డిజైన్ చేసి నిర్మించడంతో మొత్తం మార్కెట్యార్డు భవనాల్లో విద్యుత్ దీపాల అవసరం ఉండదు. వెలుతురు కోసం ఒక్క యూనిట్ కరెంట్ కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఆరు ఎయిర్ వెంటిలేటర్ బ్లోయర్స్తో నిమిషానికి 26సార్లు లోపలి గాలిని ఫిల్టర్ చేసి బయటకు పంపేలా కూల్ ఎయిర్ వెంటిలేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దుకాణాల్లో ఎప్పుడూ 24నుంచి 26డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో విద్యుత్ వాడకం తక్కువగా ఉండనుంది. సిమెంట్, స్టీల్ వాడకాన్ని తగ్గించడానికి తొలిసారిగా ఫ్యాబ్రిక్ డస్ట్తో తయారైన రీసైక్లింగ్ ఇటుకలను వినియోగించడం వల్ల ఒక చదరపు అడుగుకు రూ.1500 ఖర్చు చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో పర్యావరణ హితంగా నిర్మించిన ఈ నిర్మాణానికి ఇంటిగ్రేటెడ్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ సంస్థకు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో కనీస రేటింగ్ వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5కోట్లు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ నుంచి వచ్చే వ్యర్ధాలతో ప్రత్యేకంగా ఒక బయోప్లాంట్ను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు.
5బ్లాకుల్లో 211 దుకాణాలు
ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ను 5బ్లాకులుగా నిర్మించారు. బ్లాక్ ఏలో గ్రౌండ్ఫ్లోర్లో కమర్షియల్ షాపులు 74, కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు 8బ్లాకుల్లో 85 దిమ్మెలు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో కమర్షియల్ షాపులు 91, బ్లాక్ బీలో పూల మార్కెట్, బ్లాక్ సీలో గ్రౌండ్ ఫ్లోర్లో ఏటీఎం, సెక్యూరిటీ గార్డు రూమ్, మేనేజర్ గది, మొదటి అంతస్తులో షాపులు, క్యాంటిన్, బ్లాక్ డీలో గ్రౌండ్ఫ్లోర్లో పండ్ల మార్కెట్కు 12షాపులు, మొదటి అంతస్తులో 11షాపులు, బ్లాక్ ఈలో గ్రౌండ్ ఫ్లోర్లో మాంసాహారం షాపులు 12, మొదటి అంతస్తులో 11 షాపులతోపాటు ఆయా బ్లాకుల్లో స్త్రీలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు, ఎలక్ట్రికల్ రూమ్ను ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ రాకకు అంతా
సూర్యాపేట, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలో ఆదివారం ప్రారంభించాల్సిన భవనాలు ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి కాగా.. గ్రీనరీ, రంగులు వేయడం, లైటింగ్ వంటి తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. పట్టణానికి నలుమూలలా నిర్మించిన భవనాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి పర్యటించేలా మంత్రి సూచనల మేరకు రూట్ మ్యాప్ తయారు చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే రూట్లలో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న భవనాలను, బహిరంగ సభా స్థలిని మంత్రి జగదీశ్రెడ్డి ఉదయం, సాయంత్రం సుడిగాలి పర్యటన చేస్తూ పరిశీలించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సభాస్థలి వద్దే ఉండి ఏర్పాట్లను చూశారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రారంభోత్సవాలు చేసే భవనాలను పరిశీలించి అధికారులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి జనం భారీగా తరలి వస్తారనే సమాచారంతో ఇబ్బందులు ఎదురవకుండా సూర్యాపేట మున్సిపాలిటీతోపాటు నాలుగు మండలాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులను ఇన్చార్జీలుగా నియమించిన విషయం విదితమే. గురువారం ఆయా ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించగా.. రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. సమావేశాల్లో ఇన్చార్జీలు, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
4 అంతస్తుల్లో కార్యాలయం
సూర్యాపేట సిటీ, జూలై 17 : పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఆ మేరకు ఆయా శాఖల కార్యాలయాలను సకల వసతులతో నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేటలో కార్పొరేట్ ఆఫీసు తరహాలో జిల్లా పోలీసు కార్యాలయాన్ని నిర్మించారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషితో 20ఎకరాల్లో 56వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.38కోట్లతో జీ+4 భవనం నిర్మించారు. అన్ని హంగులతో, అత్యాధునిక సాంకేతికతో నిర్మించిన ఈ బిల్డింగ్ పెద్ద రాజకోటను తలపిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నది.
భవన ప్రత్యేకతలు
హైవేకు అతి సమీపంలో పోలీసు శాఖలోని అన్ని విభాగాలకు కేటాయించేలా జిల్లా పోలీసు కార్యాలయాన్ని నిర్మించారు. జిల్లా పోలీసు అధికారి కార్యాలయం, అదనపు ఎస్పీ ఆఫీసు, అడ్మినిస్ట్రేషన్ విభాగం, జిల్లా స్పెషల్ బ్రాంచి, పాస్పోర్టు వెరిఫికేషన్, జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరో, ఐటీ అండ్ కమ్యూనికేషన్ హాల్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, సైబర్ క్రైమ్ ఎనాలసిస్ సెంటర్, పోలీసు కంట్రోల్ రూమ్, ఎలక్ట్రికల్ ప్యానెల్ రూమ్, క్లూస్ టీం, కాన్ఫరెన్స్ హాల్, రిసెప్షన్ సెంటర్, విజిటర్స్ లాన్, విశాలమైన పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. ఫిర్యాదులు, ఇతర పనులపై వచ్చే సామాన్య ప్రజలతో ఎస్పీ నేరుగా మాట్లాడేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ హాల్ను ఏర్పాటు చేశారు. పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ భవన్ నిర్మాణం సైతం చేపట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను ఇక్కడి నుంచి చూడవచ్చు. పరేడ్ గ్రౌండ్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్, బ్యారక్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమినీటీస్ బ్లాక్, డాగ్ కన్నెల్స్, ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులకు కార్యాలయాలు కేటాయించారు. అత్యాధునిక టెక్నాలజీతో కొత్త హంగులతో గాలి, వెలుతురు వచ్చేలా విశాలమైన గదులతో అందరికీ సౌకర్యవంతంగా కార్యాలయ నిర్మాణం జరిగింది. ఈ కార్యాలయాన్ని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా.. అధికారులు తుది పనులపై కసరత్తు వేగవంతం చేశారు. మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశాల మేరతకు ఎస్సీ రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.
సభకు స్వచ్ఛందంగా..
సూర్యాపేట, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఆదివారం నిర్వహించతలపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు జనం సిద్ధమవుతున్నారు. సాగునీటితోపాటు ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందుతుండడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు సూర్యాపేట నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు సమావేశాలు పెట్టుకుంటూ తీర్మానాలు చేస్తున్నారు. జనం ఉత్సాహం చూస్తుంటే సభకు జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మంది హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. సూర్యాపేట పట్టణంలోని 48 వార్డుల నుంచి 50వేలు, మండలానికి 20వేల చొప్పున నాలుగు మండలాల నుంచి 80వేల మంది.. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 30వేలు, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి 20వేల చొప్పున మొత్తం రెండు లక్షల మంది సభకు హాజరు కానున్నారు. కాగా, సూర్యాపేట, చివ్వెంల, పెన్పహాడ్ మండలాల నుంచి వేలాది మంది పాదయాత్రగా తరలి వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంత పెద్ద మార్కెట్ను ఊహించలేదు
సూర్యాపేటలో ఇంత పెద్ద మార్కెట్ నిర్మిస్తారని మేము కలలో కూడా ఊహించలేదు. లోపలికి వెళ్లి చూస్తే మాకే ఆశ్చర్యమేసింది. లైట్ వేయకుండానే దుకాణంలో వెలుతురు వస్తుంది. మార్కెట్ లోపల మొత్తం పగటి వెలుతురును తలపిస్తుంది. చల్లగా ఉంది. ఇదంతా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోనే సాధ్యమైంది. మేము ఇక్కడే వ్యాపారం చేస్తుండగా నిర్మాణం సమయంలో మంత్రి చాలాసార్లు వచ్చి చూసిండ్రు. ఇంత పెద్ద మార్కెట్లో మేము వ్యాపారం చేయబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.
– ఎస్కే మౌలానా, కూరగాయల వ్యాపారి, సూర్యాపేట
గతంలో ఎండకు ఎండినం.. వానకు తడిసినం
సూర్యాపేటలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోనే అయ్యింది. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. నేను 25ఏండ్లుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నా. ఎండకు ఎండినం.. వానకు తడిసినం. ఇప్పటి వరకు మాకు దుకాణాలు ఎవరూ ఇయ్యలేదు. ఆ ఆలోచన కూడా చేయలేదు. కానీ.. మంత్రి జగదీశ్రెడ్డి మా కోసం ఇంత పెద్ద మార్కెట్ను కట్టించిండు. మాకు అందులో చోటు ఇస్తానన్నాడు. మాకు అంతకంటే ఇంకేం కావాలి. ఆనందంగా వ్యాపారం చేసుకుంటాం. మంత్రి జగదీశ్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం.
– వాంకుడోతు పూరి, కూరగాయల వ్యాపారి, సూర్యాపేట