స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ఆవిర్భవించనున్నది. సమైక్య రాష్ట్రంలో ఉప ప్రాంతీయ పార్టీగా పుట్టి, రాష్ర్టాన్ని సాధించుకొని ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందింది. సాధించుకున్న రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన పార్టీగా టీఆర్ఎస్ గ్రామగ్రామానికి విస్తరించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రతి మూలమూలనా గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. ఇలాంటి సందర్భంలో దేశ గతిని మార్చడానికి పార్టీ అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ బుధవారం చారిత్రాత్మక
నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ను స్వాగతిస్తూ జిల్లా అంతటా సంబురాలు అంబరాన్నంటాయి. పండుగ పూట ఊరూరా, వాడవాడలా జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు మార్మోగాయి. అన్ని ఊళ్లల్లోనూ గులాబీ శ్రేణులు పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నాయి. కొన్నిచోట్ల డప్పులు, కోలాట నృత్యాలతో గ్రామ కూడళ్లల్లో దసరా కలిపి సంబురాలు జరుపుకొన్నారు. అసాధ్యమనుకున్న రాష్ర్టాన్ని సాధించిన నేత సీఎం కేసీఆర్ దేశ భవిష్యత్కు దిక్సూచి అవుతాడన్న విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దేశ్కీ నేత కేసీఆర్ అంటూ జేజేలు పలుకుతున్నారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీ(టీ)ఆర్ఎస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దసరా పండుగ రోజున ఊర్లకు చేరిన జనం సాక్షిగా గ్రామగ్రామాన సంబురాలు మిన్నంటాయి. బీ(టీ)ఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు సంబురాల్లో మునిగి తేలారు. నల్లగొండలోని క్లాక్టవర్ సెంటర్లో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. పటాకులు కాల్చి స్వీట్టు పంచుకున్నారు. ఆనందోత్సాహంతో నృత్యం చేశారు. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ నినాదాలు చేశారు. అంతకుముందు పట్టణంలోని వీటీ కాలనీ హనుమాన్ ఆలయంలో పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ విజయవంతంగా ముందుకు సాగాలంటూ.. కేసీఆర్ నేతృత్వంలో దేశానికి మంచి రోజులు రావాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నకిరేకల్లో బీఆర్ఎస్ను స్వాగతిస్తూ పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. నార్కట్పల్లి, కట్టంగూర్, కేతేపల్లి, శాలిగౌరారంలో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. చిట్యాలలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి నేతృత్వంలో సంబురాలు జరిగాయి.
ఉప ఎన్నికలు జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలోని గ్రామగ్రామాన సంబురాలు మిన్నంటాయి. చండూర్లో మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళావెంకన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. మునుగోడుతోపాటు పలు గ్రామ కూడళ్లలో పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో పండగ వాతావరణంలో సంబురాలు జరుపుకొన్నారు. పలుచోట్ల పార్టీ శ్రేణులు, అభిమానులు ర్యాలీలు తీశారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. యువనేత నల్లమోతు సిద్దార్ధ, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి పార్టీ శ్రేణులకు స్వీట్లు పంచుతూ వేడుకల్లో పాల్గొన్నారు. దేవరకొండ, కొండమల్లేపల్లి, డిండి, పీఏ పల్లి, చందంపేట మండలాల్లో సంబురాలు నిర్వహించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలుచోట్ల పార్టీ శ్రేణులు ర్యాలీలు తీశారు. పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. ఒక వైపు దసరా ఉత్సవాలు.. మరోవైపు బీఆర్ఎస్ సంబురాలతో పట్టణాలు, గ్రామాల్లో సందడి నెలకొంది. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీపైన చర్చనే సాగింది. ఉద్యమ పార్టీ నుంచి అధికార పార్టీ.. ప్రస్తుతం జాతీయ పార్టీగా ఆవిర్భవించిన సందర్భాన్ని ఇతర రాజకీయ పక్షాలు కూడా ఆసక్తిగా గమనిస్తుండడం విశేషం.