తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామానికి మంచి రోజులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామానికి మహర్దశ పట్టనున్నది. గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను ఇటీవల జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపించగా.. నేడో, రేపో అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంశాల వారీగా నిధులు విడుదల అయిన వెంటనే నిర్మాణ పనులు షురూ కానున్నాయి. వాసాలమర్రి కనీవినీ ఎరుగని రీతిలో సకల సదుపాయాలతో కొత్తరూపు సంతరించుకోనున్నది. ఊరంతా ప్రభుత్వ ఇండ్లు, అన్ని రకాల కొత్త ప్రభుత్వ భవనాలు, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ హాల్, కొత్త ఎలక్ట్రిసిటీ సిస్టం, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ అందుబాటులోకి రానున్నాయి. గ్రామంలో ప్రజలు తమ స్థలాలు ఇవ్వడానికి త్వరగా ఒప్పుకోకపోవడంతో పాటు అంతా ఏకతాటిపైకి వచ్చేందుకు సమయం పట్టిందని, అందుకే పనుల ప్రారంభానికి ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని తుర్కపల్లి మండలంలో ఉన్న వాసాలమర్రిని 2020 నవంబర్1న సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. పలు సార్లు గ్రామాన్ని సందర్శించి స్వయంగా కలియ తిరిగారు. మోడల్ విలేజ్గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అధికారులు పలు దఫాలు వాసాలమర్రిని సందర్శించారు. గ్రామంలో సర్వేలు, అధ్యయనం చేశారు. దీనికి సంబంధించి ఓవరాల్గా డీపీఆర్ను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే తాజాగా విభాగాల వారీగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు వచ్చాయి. దాంతో ఆయా విభాగాల వారీగా కొత్తగా గత వారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దాంతో వీటికి ఒకటి, రెండు రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్న ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది. దీని తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
481 కొత్త ఇండ్లు..
సీఎం కేసీఆర్ వాసాలమర్రి వచ్చినప్పుడు పలు హామీలు ఇచ్చారు. అందులో భాగంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటిని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సర్వే చేసిన అధికారులు కొత్తగా 481 కుటుంబాలకు ఇళ్లు కట్టించాలని ప్రతిపాదించారు. 191 గ్రౌండ్ ఫ్లోర్, 145 జీ+వన్ బిల్డింగ్లను నిర్మించనున్నారు. దాంతో ఊరంతా పక్కా భవనాలు దర్శనమివ్వనున్నాయి. ఇప్పటికే ఉన్న కచ్చా ఇండ్లను పూర్తి తొలగించనున్నారు. ఇక ప్రభుత్వ అనుమతుల తర్వాత గ్రామంలో అందరికీ ఇండ్లతోపాటు అన్ని రకాల సదుపాయాలను కూడా కల్పించనుంది. ఎక్కడికక్కడే డ్రైనేజీ వ్యవస్థ, 24 గంటలు తాగునీరు వ్యవస్థను అందుబాటులోకి రానుంది. సెప్టిక్ ట్యాంక్లతో పాటు గల్లీగల్లీకి సీసీ రోడ్ల నిర్మాణం జరగనుంది. కొత్తగా మొత్తం ఎలక్ట్రిసిటీ వ్యవస్థ రానుంది.. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు ఎలక్ట్రికల్ వైర్లు అన్నీ కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. సెంట్రల్ లైటింగ్ వ్యవస్థతో ఊరంతా వెలుగులతో ధగధగ మెరవనుంది. ఇలా గ్రామానికి అవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించనున్నారు.
ప్రభుత్వ భవనాలు ఇవీ..
స్కూళ్లు, హాస్పిటల్, కమ్యూనిటీ బిల్డింగ్స్ అన్ని సర్కారు కార్యాలయాలు కొత్త భవనాల్లో కొలువుదీరనున్నాయి. ఐదు అంగన్వాడీ భవనాల కోసం మాస్టర్ ప్లాన్ను ప్రతిపాదించారు. కిచెన్ అండ్ డైనింగ్తో కూడిన ప్రాథమిక, జడ్పీ ఉన్నత పాఠశాలల భవనాలు వేర్వేరుగా నిర్మించనున్నారు. ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్, వెటర్నరీ సబ్ సెంటర్, కిచెన్ అండ్ డైనింగ్తో కూడిన కమ్యూనిటీ హాల్, గ్రామపంచాయతీ బిల్డింగ్ను కట్టనున్నారు. ఇవే కాకుండా ఇంటిగ్రేటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. ఇక్కడ 12 షాపులు ఒకే దగ్గర కేంద్రీకృతం కానున్నాయి. ఇక ప్రస్తుతం పాత ఇండ్లను తొలగించి, కొత్తగా కట్టే సమయంలో కొందరికి కొంత మందికి చెందిన ఓపెన్ ప్లేస్ కోల్పోయే వారికి మరో చోట స్థలం ఇవ్వనున్నారు.
ఆలస్యానికి కారణాలు ఇవే..
వాసాలమర్రి గ్రామంలో అభివృద్ధ్ది పనులు ప్రారంభం కాకపోవడానికి పలు కారణాలు లేకపోలేదు. గ్రామంలోని ప్రజలు తమ స్థలాలను వదులుకోకపోవడం, రోడ్డు వెడల్పునకు వెంటనే ఒప్పుకోపోవడంతోపాటు అంతా ఏకతాటిపైకి వచ్చేందుకు ఆలస్య మైంది. ఎక్కువ స్థలం ఉన్నోళ్లు స్థలాలను ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదు. మార్కింగ్ చేసిన రోడ్డు స్థలాన్ని కోల్పోవడానికి ఇష్టం లేని వాళ్లను ఒప్పించేందుకు సమయం పట్టిందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఎస్సీలందరికీ దళిత బంధు ..
దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న దళిత బంధు పథకాన్ని వాసాలమర్రిలో పైలెట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. పథక ప్రారంభానికి సీఎం కేసీఆర్ స్వయంగా హాజరయ్యారు. అనంతరం గ్రామంలో ఉన్న 76 మంది దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం వర్తించింది. పథకం అమలులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల సాయం చేసింది. దాంతో గతంలో వెనుకబాటుకు గురైన ఎస్సీలు సర్కారు తోడ్పాటుతో ఇప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ సాయంతో ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులు నిలదొక్కుకోవడమే లక్ష్యంగా అధికారులు కొత్తకొత్త వ్యాపారాలు పెట్టించారు. కిరాణ, మెడికల్ సామాన్ల డీలర్ షిప్, ప్లాస్టిక్ ప్లేట్లు, టీకప్పుల తయారీ, డయాగ్నోస్టిక్స్, సెంట్రింగ్ కొత్త బిజినెస్లు ఏర్పాటు చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారు. పథకం వచ్చిన అతి తక్కువ కాలంలోనే అందరూ గర్వించేలా నెలకు రూ. 30 నుంచి 40వేలు సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.