‘నకిరేకల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను బ్రహ్మాండంగా గెలిపించండి. నకిరేకల్కు ఏం కావాలో అవన్నీ చేసే బాధ్యత నాదే. లింగయ్య ఏనాడూ తన సొంత పనుల కోసం నా వద్దకు రాడు. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక అభివృద్ధి పని ఫైల్ పట్టుకొని కనిపిస్తడు. ఆయన తపనంతా నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధే. ఇలాంటి ఎమ్మెల్యే మీకు ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఈ సారి నకిరేకల్కు ఏదో ఒక లిఫ్ట్ కావాలని అడుగుతున్నడు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించి పంపండి. లిఫ్ట్ ఏంది ఏది కావాలన్నా అన్ని ఇచ్చే బాధ్యత నాది’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
నకిరేకల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు వంద శాతం పూర్తి చేస్తామని, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వలను కూడా పూర్తి చేసి సాగునీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి కాళేశ్వరం జలాలను లింక్ చేయడం వల్ల రామన్నపేట కరువుకు విముక్తి కల్పిస్తామని తెలిపారు. చిరుమర్తి లింగయ్య నకిరేకల్లో ఘనవిజయం సాధించబోతున్నారని, ఈ సభకు హాజరైన జనమే ఇందుకు నిదర్శమని కేసీఆర్ చెప్పారు.
సూర్యాపేట, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : “నకిరేకల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను బ్రహ్మాండంగా గెలిపించండి మీకు ఏం కావాలో అవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటా” అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. లింగయ్య ఏనాడూ తన సొంత పనుల కోసం తన వద్దకు రాలేదు… ఎప్పుడు వచ్చినా ఏదో ఒక అభివృద్ధి పని కోసం ఫైల్ పట్టుకొని వస్తాడని… ఆయన తపనంతా నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ది గురించే అని.. ఇలాంటి ఎమ్మెల్యే మీకు ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం… ఈ సారి నకిరేకల్కు ఏదో ఒక లిఫ్ట్ కావాలని అడుగుతున్నాడు ఆయనను భారీ మెజారిటీతో గెలిపించి పంపండి.. ఏమి కావాలన్నా నాది బాధ్యత అంటూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం నకిరేకల్ మూసీ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఈ జిల్లా వట్టికోట అల్వార్ స్వామి పుట్టిన గడ్డ, నర్ర రాఘవరెడ్డి లాంటి మహావీరులు ఉద్యమాలు చేసిన గడ్డ అని, బాగా చైతన్యమున్న ప్రాంతమని కితాబిచ్చారు. “మీ అందరిని నేను ఒకటే కోరుతున్నా ఎన్నికలు వస్తుంటాయ్ పోతుంటాయ్.. 75సంవత్సరాల భారత దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంత పరిణతి రావాలో అది ఇంకా రాలేదు. ఎన్నికలు వస్తే ఆగం కావద్దు ఆలోచన వివేచనతో ఓటేస్తే మనకు మంచి జరుగుతుంది. బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ల ముందర తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సాధించడం కోసం.. 15 సంవత్సరాలు పోరాటం చేసి అనేక మంది జైళ్ల పాలయ్యారు. నకిరేకల్కు చెందిన మిత్రుడు చెరుకు సుధాకర్ వంటి ఎంతో మంది శిక్షలు అనుభవించి పోరాడినం.” అంటూ సీఎం గుర్తు చేశారు.
“ఇప్పటికే రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఆయా ప్రాంతాల్లో ధాన్యం పంట వంద నుంచి మూడు వందల శాతం పెరిగింది. నకిరేకల్ నియోజకవర్గంలో చేపట్టిన ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువలు పూర్తి కావచ్చాయి… బ్రాహ్మణ వెల్లెంల ట్రయల్న్ కూడా పూర్తయింది. నీళ్లు కూడా వచ్చాయయి. ఇవి వందశాతం పూర్తి కావాలి. అలాగే ధర్మారెడ్డి, పిల్లాయిపాల్లి కాలువ పనులు కూడా పూర్తి అయితే దాని నుంచి కూడా నీళ్లు వస్తయి. ఇదంతా జరుగాలంటే మీకు ఎమ్మెల్యేగా లింగయ్య రావాలి కదా” అని సీఎం కేసీఆర్ అన్నారు.
“కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బస్వాపురం లింకు ద్వారా రామన్నపేట మండలానికి బ్రహ్మండంగా నీళ్లు వస్తాయి. తద్వారా రామన్నపేట ప్రాంతం కరువు నుంచి విముక్తి లభిస్తుంది. ఇప్పటికే వందల కోట్లు తెచ్చి నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న మీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. నిధుల కోసం నా వద్దకు ఎలాంటి జంకూ లేకుండా వచ్చి మా ప్రజల కోసం అది కావాలి… ఇది కావాలని అని అడుగుతుంటడు. ఇలాంటి ఎమ్మెల్యే మీకు దొరకడం నిజంగా అదృష్టం” అని సీఎం కేసీఆర్ చెప్పారు.
“నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్రా రాఘవరెడ్డి ఎండిపోయిన వరి కంకులు తెచ్చి అసెంబ్లీలో చూపెడుతుండేది. కరెంట్ కోసం రోజూ కొట్లాడుతుండె. విజయవాడ రోడ్డు కూడా బంద్ పెడుతుండే. అలాంటి మహా నాయకున్ని కన్న గడ్డ ఇది.” అని సీఎం కేసీఆర్ అన్నారు. “కమ్యూనిస్టులను నేనే ఒకటే కోరుతున్న. మీ అభ్యర్థి కూడా లేడు. ఇక్కడ ఎవరికో ఓటేయకుండా అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్న చిరుమర్తి లింగయ్యకు మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నా” అని సూచించారు.
“ఇవాళ నాకొకటి అర్థ్దమైంది. ఈడ ఉన్న వాళ్లు కాకుండా చాలా మంది బయట ఉన్నరు. ఈ సభతో లింగయ్య గెలిచిండని అర్థమైంది. దాన్ని ఎవరూ ఆపలేరు. ప్రజాశక్తి ముందు ఎవరూ ఏం చేయలేరు. లింగయ్య నన్ను వాళ్లు తిడుతున్నరు, వీళ్లు తిడుతున్నరు అంటున్నావు… తిట్టుకోనియ్యి… నీవు ప్రజల కోసం ఎప్పుడు పడే తపన వీడకు… నీకు చెబుతున్నా ఇంత పెద్ద ప్రజాశక్తి నీ వెంట ఉంది.. ఎవడు ఏం అనుకుంటే నీకేంది.” అంటూ సీఎం కేసీఆర్ చిరుమర్తి లింగయ్య భుజం తట్టారు. “తప్పకుండా గెలుపు నీదే. బ్రహ్మాండమైన విజయం మనం సాధించబోతున్నాం.
అందులో ఎలాంటి సందేహం లేదు. నకిరేకల్ నియోజకవర్గానికి నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటాను. అలాగే లింగయ్య ఏ నాడు వ్యక్తిగత పనులు అడగలేదు, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, అయిటిపాముల ఎత్తి పోతలు, ఆస్పత్రులు, రోడ్ల గురించి అడిగిండు తప్ప ఇంకోటి అడగలేదు. మంచి వ్యక్తి..ఆయనను బ్రహ్మండంగా గెలిపించండి. మీకు అనుకున్న పనులు నేను చేస్తాను. మంది మాటలు పట్టుకొని మరు మనుం పోతే మల్లొచ్చేసరికి ఇల్లు కాలిపోయిందన్న చందంగా ఎవరో చెబితే ఓటు వేయొద్దు… ఆలోచించి అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను ఆదరించి చిరుమర్తి లింగయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి.” అని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.