తక్కువ వేతనంతో పనిచేస్తున్న వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వారిని రెగ్యులరైజ్ చేయడంతోపాటు పే స్కేల్తో ఇతర శాఖల్లో ఉద్యోగాలు కల్పించేలా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు గురువారం క్యాబినెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని సుమారు 2వేల మందికి ప్రయోజనం కలుగనుంది.
– సూర్యాపేట, మే 19 (నమస్తేతెలంగాణ)
సూర్యాపేట, మే 19 (నమస్తేతెలంగాణ) : వీఆర్ఏలను క్రమబద్ధీకరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో క్యాబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకోవడం పట్ల వీఆర్ఏల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ, చిత్రపటాలకు శుక్రవారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఏండ్ల తరబడి గ్రామాల్లో వెట్టి చాకిరీ చేస్తున్న వీఆర్ఏలను రెగ్యులరైజేషన్ ద్వారా స్కేల్ వర్తించి వేతనం పెరుగనుండడంతో తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడారు. దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 వేల మంది వీఆర్ఏలు ఉండొచ్చని అంచనా ఉండగా అన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దాంతో శుక్రవారం ఆనందంతో పాలాభిషేకాలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.