కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని, దాని స్థానంలో భూ మాత తెచ్చి పట్టాదారు, కౌలుదారు కాలం పొందు పరుస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు. అంటే ఇప్పుడున్న ధరణితో కాంగ్రెస్ నేతలకు గిట్టుబాటు కాదన్న ధోరణిని ఆయన చెప్పకనే చెప్పినట్లుగా స్పష్టమవుతున్నది. తాము అధికారంలోకి వస్తే ఏం లాభమన్న రీతిలో కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నట్లు అర్థమవుతున్నది. అందుకే పాతకాలం నాటి పటేల్, పట్వారీ వ్యవస్థ వైపు మొగ్గు చూపుతూ దానికి భూమాత అన్న పేరు తగిలించాలని యోచిస్తున్నారు.
భూముల విలువలు లక్షల నుంచి కోట్లకు చేరుతున్న తరుణంలో తిరిగి పట్టాదారు పాసు పుస్తకాల్లో పట్టాదారు కాలంతోపాటు అనుభవదారు లేదా కౌలుదారు కాలం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూడడంపై రైతులు మండిపడుతున్నారు. ఏడాది, రెండేండ్లు కౌలుకు ఇచ్చినంత మాత్రాన కౌలు రైతుల పేర్లు పట్టాదారు పాసు పుస్తకాల్లో ఎలా చేరుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమిని కౌలుకు ఎవరూ ఇవ్వని పరిస్థితులు రావడం తథ్యమని, ఇదే జరిగితే చిన్న, సన్న కారు రైతుల ఉనికికే ప్రమాదం పొంచి ఉన్నదని క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) కుట్రలు, కుతంత్రాల కాంగ్రెస్ పార్టీ నేతలకు మరోసారి పచ్చబడుతున్న వ్యవసాయంపై, తెల్లబడుతున్న రైతన్నపై కన్ను కుట్టినట్లుంది. ఇన్నాళ్లూ 24గంటల కరంటు వద్దు.. రైతుబంధు దండుగ.. ధరణిని ఎత్తేస్తాం అన్న ఆ పార్టీ పెద్దలు ఇప్పుడు ఏకంగా రైతుల భూమి హక్కులపైనే గురి పెట్టారు. గత కాంగ్రెస్ పాలన నాటి పాత పటేల్, పట్వారీ వ్యవస్థతో కుప్పకూలిన భూ హక్కుల వ్యవస్థను పకడ్బందీగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఆలోచనలు చేశారు. ఎంతో మంది మేధావులు, రెవెన్యూ నిపుణులు, భూ హక్కులపై న్యాయ కోవిదులతో చర్చోపచర్చలు జరిపి ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టారు. భూమిపై యజమానులకు ఉండే హక్కుకు మరింత భద్రత కల్పించేలా పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
కొత్త పాసుపుస్తకాలను రూపొందిస్తూ సర్వ హక్కులు భూ యజమానులు అయిన రైతులకే కల్పించారు. గతంలోని అనుభవదారు/ మన్యందారు వంటి కాలాలను ఎత్తివేస్తూ కేవలం పట్టాదారు కాలాన్ని మాత్రమే ప్రమాణికంగా తీసుకున్నారు. అంటే ప్రస్తుత భూమి, దానికి ఉన్న విలువ ఆధారంగా భూమిపై వేరెవరికీ హక్కులు లేకుండా రైతుకే పెద్దపీట వేశారు. భూ హక్కు బదలాయించాలంటే కూడా స్వయంగా ఆ యజమానే తన బొటనవేలు పెడితే సాధ్యం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఎన్నో సంస్కరణలను కాంగ్రెస్ పెద్దలు ఆది నుంచే జీర్ణించుకోలేక పోతున్నారు. భూమిపై తమ దళారీ పెత్తనాలు పోతున్నాయని, రైతులు ఇక తమ చెప్పుచేతుల్లో ఉండరని ఇలా ఎన్నో విధాలుగా కుట్ర పూరితంగా ఆలోచిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. అందుకే కాంగ్రెస్ పెద్దలు ధరణి స్థానంలో భూ మాత పేరుతో రైతు హక్కులకు ఎసరు పెట్టే కుట్రలు చేస్తుండడాన్ని రైతుల జీర్ణించుకోలేక పోతున్నారు. పాత పద్ధతుల్లో ఒకే భూమిపై పలువురికి పలు రకాల హక్కులకు తిరిగి తెరలేపనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రకటిస్తుండడం తగదని హెచ్చరిస్తున్నారు.
వాస్తవంగా ప్రస్తుతం వ్యవసాయ రంగం భారీ వృద్ధిలో ఉన్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 35లక్షల ఎకరాల భూమి ఉంటే.. 2014కు పూర్వం 13లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో సాగునీరు, ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా వంటి ఎన్నో పథకాలు వ్యవసాయానికి ఊతమిచ్చాయి. దీంతో ప్రస్తుతం జిల్లాలో 26లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. ఇలా భూములన్నీ సాగులోకి రావడంతో వాటి ధరలు కూడా అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ భూమి ఎకరం ధర కనిష్ఠంగా రూ.30 లక్షల నుంచి గరిష్ఠంగా కోటి రూపాయలు దాటింది. ఈ పరిస్థితుల్లో భూమిపై హక్కులకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో మాదిరిగా ఎకరం రూ.50వేలు లేదా లక్ష రూపాయలు ఉంటే పెద్దగా పట్టించుకునే వారు కాదు. ప్రస్తుత భూమి రేట్ల ఆధారంగానే పకడ్బందీగా సదరు భూములపై కేవలం యజమానులకే సర్వ హక్కులు ఉండేలా ప్రభుత్వం ఆలోచించింది. అందుకే ధరణి పోర్టల్తోపాటు కొత్త పాసుపుస్తకాల్లో కేవలం పట్టాదారు కాలాన్నే పొందుపర్చింది. మిగతా వాటిని తొలగించింది.
ఇక్కడ ఇంకో విషయం ఏటంటే సాధారణంగా జిల్లాలో ఏ రైతైనా తన భూమిని కౌలుకు ఇస్తే ఏడాది, రెండేండ్లకు మించి ఇవ్వడం లేదు. ఇవ్వాల్సి వస్తే.. ఏ ఏడాదికి ఆ ఏడాదే ఒప్పందం చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో భూమి యజమానైన రైతు ఆ కౌలు రైతుకు పాసుపుస్తకాల్లో పేరు నమోదుకు అవకాశం ఎలా ఇస్తారన్నది కాంగ్రెస్ నేతలు చెప్పాల్సి ఉంది. నిజంగా అలాంటి పరిస్థితినే వస్తే.. అసలు రైతు తన భూమిని పడావు పెట్టుకునే ఆలోచన చేస్తాడు తప్ప.. కౌలుకు ఇవ్వడం జరగదన్నది స్పష్టం. ఎందుకంటే ఎకరం ధర కోటి పలుకుతుండడంతో గుంట భూమి కూడా ఎంతో విలువైందిగా మారింది. ఇవన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న ఆలోచనపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ధరణిని రద్దు చేసి గత కాలపు పద్ధతులతో భూమాతను తీసుకువస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమ భూమిపై హక్కులను వివిధ పేర్లతో వేరెవరికో కల్పిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. అందుకే రైతు వ్యతిరేకి, వ్యవసాయ సంక్షోభి కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని అన్నదాతలు తీర్మానించుకుంటున్నారు.
రైతుల భూములు తారుమారు కాకుండా, రికార్డుల్లో అవకతవకలు జరుగకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. దానిని రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం సరికాదు. ధరణి రద్దు చేయడం వల్ల రైతాంగం ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. మళ్లీ పాత రికార్డులు ఉంటే బడా బాబులు అవకతవకలకు పాల్పడే అవకాశం ఉన్నది. తెలంగాణ రైతులు ప్రస్తుత ప్రభుత్వంలో ఎంతో సంతోషకరంగా ఉన్నారు.
– కట్ట వెంకట్రెడ్డి, రైతు, సిలార్మియాగూడెం, తిప్పర్తి మండలం
ధరణితో ఒకరి భూమి కొనాలన్నా, మరొకరికి అమ్మాలన్నా రిజిస్ట్రేషన్ 15నిమిషాల్లోనే పూర్తవుతుంది. నా భూమి వేరే వ్యక్తి పట్టా చేయించుకునే అవకాశం లేదు. ఎందుకంటే నేను రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లి వేలు పెడితేనే మరొక వ్యక్తికి పట్టా అయ్యే అవకాశం ఉంటుంది. ధరణి ద్వారా లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. గతంలో రైతులు పట్టా చేయించుకోవాలంటే రోజుల తరబడి పట్వారీలు, తాసీల్దార్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. తిరిగినా డబ్బులు ఇవ్వనిదే పని కాకపోయేది. ఎకరం భూమి కొనాలన్నా పట్వారికి, తాసీల్దార్కు కనీసం రూ.30వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చయ్యేది.
అయినా.. పట్టా బుక్కు అంత తొందరగా అందేది కాదు. ధరణి ద్వారా ఇప్పుడు రైతులకు అలాంటి ఇబ్బందులు లేవు. కాంగ్రెస్ నాయకులు స్వార్థం కోసం రైతులను మళ్లీ తాసీల్దార్లు, పట్వారీల చుట్టూ తిప్పాలనే ఉద్దేశంతో ధరణిని రద్దు చేస్తామని చెప్తున్నారు. తద్వారా దళారులు, మధ్యవర్తులు లాభపడ్తారు. రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు వచ్చేది కాదు.. సచ్చేది కాదు. వాళ్ల దోపిడీ రాజ్యానికి రైతులు బలి కావాల్సిందే. ధరణితో రైతులకు ఏం ఇబ్బందులు లేకుండా నేరుగా రైతుబంధు డబ్బులు మా ఖాతాల్లో పడుతున్నాయి. మధ్యవర్తులు లేకుండా మేమే బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకుంటున్నాం. ధరణి ఉండాలె. కేసీఆరే మూడో సారి ముఖ్యమంత్రి కావాలె.
– బూడిద హరికృష్ణ, రైతు, గోడుమడక, తిరుమలగిరి సాగర్ మండలం
రైతులను ఇబ్బందులకు గురిచేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తుంది. తాము అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం అవివేకం. దేశంలో, రాష్ట్రంలో 55 ఏండ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడూ రైతుల సంక్షేమం గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. అధికారంలో ఉన్నప్పుడు పటేల్, పట్వారీ వ్యవస్థను అమలు చేసి అవినీతి, అక్రమాలకు తెరలేపారు. రైతులను ఇబ్బందులకు గురిచేశారు. భూ రికార్డులను పట్వారీల చేతిలో పెట్టడం వల్ల వారు తమకు నచ్చినట్లు మార్చులు, చేర్పులు చేసేది. భూమి ఒకరి పేరు మీద ఉంటే కబ్జాలో మరో రైతు ఉంటడు. కబ్జాలో ఉన్న రైతు పేరు రికార్డుల్లో ఉండదు. పహాణి కావాలంటే లంచం అడుగుతరు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కౌలుదారి పేరు కూడా రికార్డుల్లో రాస్తామంటున్నరు. దీంతో రైతులు ఎవరూ భూములకు కౌలుకు ఇవ్వరు. దీని వల్ల బడా రైతులు రైతుబంధు తీసుకుంటారు కానీ.. వ్యవసాయం చేయరు. దీని వల్ల గ్రామాల్లో కూలీలకు పని లభించని పరిస్థితి. పంట దిగుబడి తగ్గుతుంది. కాంగ్రెస్ పార్టీ తన పాత నియంతృత్య, రాచరికపు పోకడలను రైతులపై రుద్దాలనుకుంటే సహించరు.
– సీహెచ్ కృష్ణ, రైతు, చల్మారెడ్డిగూడెం, అనుముల, మండలం
నాకు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 40 ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 20 ఏండ్ల క్రితం పట్టదారు పాస్పుస్తకాలు, రిజిస్ట్రేషన్, బ్యాంకు రుణాల కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చుది. నెలలు గడిచినా పనులు జరుగకపోయేవి. చాలా ఇబ్బందులు పడ్డాం. తాసీల్దార్ ఉంటే, గిర్దావర్ ఉండడు. ఇద్దరుంటే వీఆర్ఓలు ఉండేవారు కాదు. ఇలా అనేక ఇబ్బందులు పడ్డాం. కానీ సీఎం కేసీఆర్ వచ్చాక ధరణి పోర్టల్ పెట్టి మంచి పని చేసిండ్రు. ఇప్పుడు మా భూమిపై మాకే హక్కును కల్పించారు. 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు అవుతున్నయి. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెసోళ్లు భూమాత పోర్టల్ తీసుకొస్తామంటున్నరు. ఇదే జరిగితే మళ్లీ పాతరోజులు రావడం ఖాయం. రెవెన్యూ రికార్డులు, కౌలుదారు, అనుభవదారు కాలమ్లను మళ్లీ పెట్టి రైతులను నట్టేట ముంచుతారు. భూమిపై రైతులకు హక్కు లేకుండా చేసేందుకే కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. అది రైతులకు ఏమాత్రం మంచింది కాదు. రైతులంతా అప్రమత్తంగా ఉండాలి.
-తుమ్మల నర్సిరెడ్డి, మంచిరోనిమామిళ్ల, తుర్కపల్లి, మండలం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని ప్రకటించడంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణితో నేడు రైతలంతా దర్జాగా ఉన్నారు. రైతులు సుఖంగా ఉండడాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ రెవెన్యూ రికార్డుల్లో కౌలుదారు, అనుభవదారు కాలాలు పెడతామని కాంగ్రెస్ చెప్పడం సిగ్గుచేటు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తెస్తే భూ సమస్యలు పెరిగి రైతులు భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. మళ్లీ వెనకటి లెక్క అధికారుల చుట్టూ తిరగడంతోపాటు లంచాలు చెల్లించాల్సి వస్తుంది. ఒకరి రికార్డును మరొకరికి రాసే అవకాశం ఉంటుంది. నేడు ధరణితో పైసా ఖర్చు లేకుండా లంచం లేకుండా దళారుల ప్రమేయం లేకుండా ఒక్కరోజులోనే భూములు పట్టాలవుతున్నాయి. ధరణిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ను తరిమికొట్టాలి.
-యాస అంజిరెడ్డి, రైతు, టి.రేపాక, ఆత్మకూరు(ఎం), మండలం