నల్లగొండ : పది రోజుల క్రితం నల్లగొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద గుర్తు తెలియని వ్యక్తి పోగొట్టుకున్న పర్సు, అందులో నగదును శుక్రవారం నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా పోగొట్టుకున్న వ్యక్తి సంబంధీకులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ కె. అదిరెడ్డి.
విధి నిర్వహణలో భాగంగా పది రోజుల క్రితం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఆయనకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పర్సు రోడ్డుపై లభించింది.
అందులో 5,620 నగదు, ఏటీఎం కార్డు, ఇతర పేపర్స్ ఉండగా పోగొట్టుకున్న వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ అందులో లేకపోవడంతో ఆయన పర్సులో ఉన్న ఏటీఎం కార్డు ఆధారంగా బ్యాంకు అధికారులతో సంప్రదించి అతని ఫోన్ నెంబర్ తెలుసుకోవడంతో పాటు, ఆయన ఒంగోలుకు చెందిన అనిల్ కుమార్ చౌదరిగా గుర్తించి సమాచారం అందించారు.
శుక్రవారం అనిల్ కుమార్ చౌదరి సంబంధీకులు నల్లగొండకు రాగా డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా సీఐ అదిరెడ్డి తనకు దొరికిన పర్సు, అందులో ఉన్న నగదు, ఏటీఎం కార్డు, ఇతర పత్రాలను అందజేసి తన మానవత్వం చాటుకున్నారు.
సీఐ అదిరెడ్డి నిజాయితీ, మానవత్వం పట్ల అనిల్ కుమార్ చౌదరి, ఆయన సంబంధీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి సీఐ అదిరెడ్డిని అభినందించారు.