నల్లగొండ జిల్లా : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన యువతి మృతి చెందింది. నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్ రెడ్డి – శోభ దంపతుల కుమార్తె గడుసు నవ్య (Gadusu Navya) ఈ ప్రమాదంలో మరణించింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆమె.. లేక్ కంట్రీ క్రౌన్ పాయింట్ దగ్గర శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. కుమార్తె మరణ వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమ ఊరి బిడ్డ కానరాని లోకాలకు వెళ్లిందని తెలిసి చెర్వుగట్టు ప్రజలు విషాదంలో మునిగిపోయారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నవ్య ఎం.ఎస్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయతల్లో ఉంది. మంచి జాబ్ సాధించి అమ్మానాన్నకు చేదోడువాదోడుగా ఉండాలనుకున్న ఆమె కలల్ని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. శ్రీనివాస్ రెడ్డి, శోభ దంపతులు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి కూతురును అమెరికాలో ఉన్నత చదువులకోసం పంపించారు. ఎంతో చలాకీగా ఉండే నవ్య మంచి ఉద్యోగం సాధిస్తుందని అకుకున్నారు. కానీ ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కన్నవాళ్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. నవ్య మృతదేహన్ని స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు సాయం చేయాలని కుటుంబ సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
తన అభిమాని గడుసు శశిధర్ రెడ్డి సోదరుడైన శ్రీనివాస్ రెడ్డి కుమార్తె నవ్య మృతి తనను వ్యక్తిగతంగా కలిచివేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదనకు లోనయ్యారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆయన భరోసానిచ్చారు. నవ్య మరణం తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కోమటిరెడ్డి.
నవ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు మంత్రి. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు నవ్య మృత దేహాన్ని వెంటనే స్వగ్రామానికి తెప్పించేందుకు మంత్రి రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడారు. అమెరికాలోని తానా, ఆటా ప్రతినిధులతో మాట్లాడి నవ్య మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు సహకరించాలని కోమట్రెడ్డి కోరారు.