రామగిరి, డిసెంబర్ 25 : క్రిస్మస్ వేడుకలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శాంతి, ప్రేమ, కరుణకు ప్రతిరూపమైన ఏసుక్రీస్తును కొలుస్తూ క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అర్ధరాత్రి నుంచే కేక్ కటింగ్లు చేసి, కొవ్వొత్తులు వెలిగించారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పాస్టర్ల బోధనలు, భక్తి గీతాలతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.
పలు చర్చిల వద్ద ఏర్పాటు చేసిన ఏసుక్రీస్తు జనన వృత్తాన్ని తెలియ జేసే ఘట్టాలు ఆకట్టుకున్నాయి. శాంటాక్లాజ్ వేష ధారణలో చిన్నారులు అలరించారు. నల్లగొండలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పలుచోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.