బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాకు రానున్నారు. కోదాడ, తిరుమలగిరిలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజా బహిరంగ సభలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ముందుగా కోదాడ పట్టణంలోని కట్టకొమ్ముగూడెం బైపాస్లో ఏర్పాటు చేస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు హాజరై, అటు నుంచి తిరుమలగిరి పట్టణంలో నిర్వహించే తుంగతుర్తి నియోజకవర్గ సమర శంఖారావానికి చేరుకుంటారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్న అభిమాన నేత కేసీఆర్ను చూసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమవుతున్నారు. పెద్దఎత్తున తరలి రెండు చోట్లా ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. శనివారం తిరుమలగిరిలో సభా ఏర్పాట్లను ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, కోదాడలో సభా స్థలిని ఎమ్మెల్యే బొల్లం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి, ఎస్పీ పరిశీలించారు. తిరుమలగిరి సభ అనంతరం సీఎం కేసీఆర్ ఆలేరులో బహిరంగ సభకు హాజరు కానున్నారు.
తిరుమలగిరి, అక్టోబర్ 28 : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం తిరుమలగిరికి రానున్నారు. మండల కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులో నిర్వహించే తుంగతుర్తి సమర శంఖారావం సభకు సీఎం హాజరై ప్రసంగించనున్నారు. సభా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజక వర్గం నుంచి వేలాది మంది సభకు తరలి రానున్నారు. సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాట్లు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. 60 వేల మందికి పైగా జనం సభకు తరలి రానున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి.
తుంగుతుర్తి నియోజక వర్గంలోని 9 మండలాలు సీఎం కేసీఆర్ రాక సందర్భంగా గులాబీమయమయ్యాయి. అడుగుడుగునా గులాబి దళపతి కౌటౌట్లు ఏర్పాటు చేశారు. ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు సభకు భారీగా తరలి వచ్చేలా గ్రామాల్లో ముమ్మర ప్రచారం సాగింది. సీఎం రాకతో నియోజక వర్గానికి మరింత మేలు జరుగుతదని ప్రజలు భావిస్తున్నారు. వెనుకబడిన తుంగతుర్తి ప్రాంతం బీఆర్ఎస్ పాలనలో ఊహలకు అందని రీతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఎమ్మెల్యేగా గాదరి కిశోర్కుమార్ గెలిస్తే నియోజక వర్గం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.
సీఎం కేసీఆర్ బహిరంగ సభకు నియోజక వర్గం నుంచి వచ్చే వాహనాలకు మూడు మార్గాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మోత్కూర్, అడ్డగూడూరు, శాలీగౌరారం మండలాల నుంచి వచ్చే వాహనాలు కూరగాయల సంతలో, నాగారం, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, నూతనకల్, మద్దిరాల మండలాల నుంచి వచ్చే వాహనాలకు సూర్యాపేట రోడ్డులోని ఇమ్మడి నర్సయ్య ఎస్టేట్లో, తిరుమలగిరి మండంలోని జలాల్పురం, మామిడాల, గుండెపురి, వెలిశాల, బండ్లపల్లి, మాలీపురం తదితర గ్రామాల నుంచి వచ్చే వాహనాలు తొర్రూర్ రోడ్డులోని వెంచర్లో పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు.
సీఎం కేసీఆర్ సభకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ రాహుల్ హెగ్డే భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలను పర్యవేక్షించారు. వాహనాల మళ్లింపు, పార్కింగ్ స్థలాల వద్ద వాహనాల నిలిపివేత వంటి అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఐదుగురు అదనపు ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 42 మంది ఇన్స్పెక్టర్లు, 400 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. కేంద్ర బలగాల సిబ్బందికి తిరుమలగిరి పాల్టెక్నిక్ కళాశాల యందు వసతి ఏర్పాటు చేయగా వసతి సదుపాయాలను ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, డీఎస్పీ నాగభూషణం, సీఐ శివశంకర్, ఎస్ఐ ప్రసాద్, సైదులు పాల్గొన్నారు.
కోదాడ, అక్టోబర్ 28 : కోదాడలో ప్రజా ఆశీర్వద సభకు సీఎం కేసీఆర్ ఆదివారం హాజరుకానున్నారు. కటకొమ్ముగూడెం బైపాస్లోని విశాలమైన 25ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణంలోని సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రజలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఇస్తూ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్, పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి శశిధర్రెడ్డి, ఎమ్మెల్సీ, ఎన్నికల ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావులు సభా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గవ్యాప్తంగా 6మండలాలతో పాటు కోదాడ పట్టణం నుంచి 75 వేలకు పైగా పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా హాజరుకానున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ను దగ్గర నుండి చూడాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సభకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.