ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్త జిల్లాను ప్రకటించి ప్రగతికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ మార్కెట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభించడానికి ఈ నెల 20న వస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం వ్యవసాయ మార్కెట్ పక్కన 70 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శనివారం సమీకృత మార్కెట్ను సందర్శించి, అనంతరం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
సుందరీకరణ పనులను రేపటిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాకు సాగునీటిని అందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పేందుకు రైతాంగం, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న సబ్బండ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతుండడంతో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. మరోవైపు సూర్యాపేట పట్టణంతోపాటు నాలుగు మండలాలకు ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కిశోర్కుమార్, భాస్కర్రావు, భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డిని ఇన్చార్జీలుగా నియమించగా, వారంతా గురువారం రంగంలోకి దిగి సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
సీఎం కేసీఆర్ రాక కోసం వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్న జనం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసాదించిన సూర్యాపేట జిల్లా ఆయన నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే ఎంతో అభివృద్ధి చెందింది. అన్ని వర్గాల ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ చెరుగని ముద్ర వేసుకుంది. గులాబీ జెండా నీడలో అంతా ప్రశాంతంగా జీవిస్తున్నారు. జిల్లాకు ఎప్పుడు వచ్చినా వరాల జల్లులు కురిపించే ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం సూర్యాపేట ప్రజానీకం వేల కండ్లతో ఎదురు చూస్తున్నది. ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నాం అనగానే విపక్షాల్లో వణుకు మొదలైంది. అందుకే ఆయా పార్టీల నేతలు దిక్కుతోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నారు.
-రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20న సూర్యాపేటలో పర్యటించనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసేందుకు మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రణాళికలు తయారు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సూర్యాపేట జిల్లాకు సాగునీటిని అందించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు రైతాంగంతోపాటు అనేక పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న సిద్ధమవుతున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చేతుల మీదుగా నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీసు కార్యాలయం, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్తోపాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మొత్తం ఆరు ప్రారంభోత్సవాలు ఉండనున్నాయి. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ పక్కన 70 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట పట్టణంతోపాటు నాలుగు మండలాల నుంచి జనాన్ని తరలించేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఇన్చార్జిలుగా నియమించారు. వారంతా గురువారం తమకు కేటాయించిన ప్రాంతాల్లో రంగంలోకి దిగారు.
స్థానిక నాయకత్వంతో కో ఆర్డినేట్ చేసుకుంటూ సీఎం సభకు వచ్చేవారు తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా వాహనాల ఏర్పాటు తదితరాలను చూసుకుంటున్నారు. అలాగే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన, ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయా ప్రాంతాల్లో ఆటోలు, కార్ల ద్వారా మైకుల్లో ప్రచారం చేపడుతున్నారు. ఇన్చార్జీలకు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, 15 వార్డులకు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు, 19 వార్డులకు నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. సూర్యాపేట మండల ఇన్చార్జీలుగా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఆత్మకూర్.ఎస్ మండలానికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, చివ్వెంల మండలానికి దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, పెన్పహాడ్ మండలానికి నకిరేకల్, భువనగిరి ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు సభ విజయవంతం కోసం మంత్రి సూచనల మేరకు జన సమీకరణ, వాహనాల ఏర్పాటు తదితరాలను చూస్తున్నారు.
సూర్యాపేట, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేటలో ఈ నెల 20న జరుగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహకాలు ముమ్మరంగా చేస్తున్నది. ఈ మేరకు గురువారం నియోజకవర్గంలోని పలుచోట్ల ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వార్డుకు 50 నుంచి 75 మంది ముఖ్య కార్యకర్తలతో వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించగా.. మండలాలకు ఇన్చార్జీలుగా ఉన్న ప్రజాప్రతినిధులు మండల సమావేశాలు ఏర్పాటు చేశారు. నేడు గ్రామాల వారీగా సన్నాహక సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఇన్చార్జీలు మాట్లాడుతూ సూర్యాపేట ఎంత అభివృద్ధి చెందిందో మీ కళ్లెదుటే సాక్షాత్కరిస్తున్నాయి. కుల, మత, వర్గాలతోపాటు అన్ని రాజకీయ పార్టీల వారు బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకుంటున్నారు.
గతంతో పోల్చి చూస్తే సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి నభూతో నభవిష్యత్ అన్న రీతిన ఉన్నది. ఈ విషయాలను ప్రజలకు గుర్తు చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వనవాసానికి వెళ్లినట్లుగా ఇంటిల్లిపాది వచ్చేలా చూడాలని సభ ఉద్దేశాన్ని వివరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి వేల సంఖ్యలో తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోలాటం, కళా బృందాలతో తరలివచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సూర్యాపేటలో ఆయా వార్డులకు కేటాయించిన ఇన్చార్జీలు ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, భాస్కర్రావు, భూపాల్రెడ్డి సమావేశాలు నిర్వహించగా.. చివ్వెంల మండలంలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, పెన్పహాడ్ మండలంలో నకిరేకల్, భువనగిరి ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి సన్నాహక సమావేశాలు నిర్వహించి ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మిగిలిన చోట శుక్రవారం సన్నాహక సమావేశాలు జరుగనున్నాయి.
పెన్పహాడ్, ఆగస్టు 17 : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ హాట్రిక్ విజయం సాధించడం ఖాయమని నకిరేకల్, భువనగిరి ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని జానారెడ్డి నగర్లో గురువారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 20న సీఎం కేసీఆర్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలు, వార్డు ఇన్చార్జిలు ప్రజలను పెద్ద సంఖ్యలో సభకు తరలించాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, పీఏసీఎస్ చైర్మన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యుగంధర్, నాయకులు మామిడి అంజయ్య, పొదిల నాగార్జున, దంతాల వెంకటేశ్వర్లు, వావిళ్ల రమేశ్, నాగరాజు, శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, రఫీ, రాధాకృష్ణ, సుదర్శన్రెడ్డి, నగేశ్, స్వర్ణ, శ్రీనివాస్, మురళి, విజయ్ పాల్గొన్నారు.
బొడ్రాయిబజార్, ఆగస్టు 17 : సూర్యాపేటలో ఈ నెల 20న నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సభ విజయవంతానికి గురువారం మున్సిపాలిటీలోని 1, 2, 14, 15 వార్డుల ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి రథసారధి సీఎం కేసీఆర్ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు. సభకు ప్రజలు ఎంత ఎక్కువ వస్తే.. ముఖ్యమంత్రి మనకు అంత ఎక్కువ వరాలిస్తారని తెలిపారు. వార్డుల్లోని నాయకులంతా కలిసికట్టుగా జనాలను సమీకరించి సభను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు గుర్రం సత్యనారాయణరెడ్డి, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్మినేటి రమేశ్, కౌన్సిలర్లు ఎల్మినేటి అభినయ్, గౌరయ్య, గొట్టేటి సైదులు, గుండపనేని కిరణ్, వార్డుల నాయకులు పాల్గొన్నారు.
సూర్యాపేట, ఆగస్టు 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జిల్లా అధికారులకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్లు సీహెచ్ ప్రియాంక, వెంకట్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం ఆయా శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం పర్యటనలో ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు. కోదాడ ఆర్డీఓ హెలిప్యాడ్ నిర్వహణ, డీడబ్ల్యూఓ జ్యోతిపద్మ రాష్ట్ర ముఖ్య కార్యదర్శితోపాటు ఇతర మహిళా ఉన్నతాధికారుల ఏర్పాట్లు చూసుకోవాలని సూచించారు. జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు జిల్లా కేంద్రంలోని పారిశుధ్య పనులను నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.
అన్ని ప్రారంభోత్సవాల వద్ద నిరంతరం విద్యుత్ ఉండేలా సౌండ్ ప్రూఫ్ జనరేటర్లు అందుబాటులో ఉంచాలని, అందుకు నాలుగు ప్రారంభోత్సవాల వద్ద నలుగురు ఏడీలను నియమించాలని ఆదేశించారు. వైద్యులతోపాటు అంబులెన్స్, కార్డియాలజిస్ట్లను అందుబాటులో ఉంచాలని, ఫైరింజన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. సమాచార ఇంజినీరింగ్ విభాగం నూతన కలెక్టరేట్ మెయిన్ మీటింగ్ హాల్, కలెక్టరేట్ ఆవరణలో సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా శాఖలకు కేటాయించిన పనులు సక్రమంగా నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ సురేశ్, డీఆర్డీఓ కిరణ్కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.