సమైక్య పాలనలో ప్రజలు మంచినీటి కోసం అష్టకష్టాలు పడ్డారు. వేసవిలో అయితే మహిళలు బిందెడు నీటి కోసం చేతిపంపుల వద్ద గంటల కొద్దీ నిరీక్షించిన పరిస్థితి. నల్లా నీళ్లు రాక ఆందోళనకు దిగిన సంఘటనలు అనేకం. ఇప్పుడా దుస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సురక్షిత తాగునీటిని అందించాలనే బృహత్తర లక్ష్యంతో మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారు. ఇందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయగా.. పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. దీని ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించి మహిళల కష్టాలకు చెక్ పెట్టారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ఇబ్బందులు తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గతంలో రోజూ ఉదయం పూట పనులు మానుకోని చేతిపంపుల వద్ద నిరీక్షించే వాళ్లమని, నేడు ఆ కష్టాలు తొలగిపోయాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– మిర్యాలగూడ, సెప్టెంబర్ 8
మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించేందుకు సీఎం కేసీఆర్ రూ.330,60,33,000 విడుదల చేశారు. ఈ నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా 278 ట్యాంకుల నిర్మాణం చేసి 119 గ్రామ పంచాయతీలకు, వాటి పరిధిలోని ఆవాస గ్రామాలకు పైపులైన్లు వేసి ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందిస్తున్నారు. మిర్యాలగూడ మండలంలో 95 ట్యాంకులు, పట్టణంలో ఏడు, అడవిదేవులపల్లి మండలంలో 34, దామరచర్ల మండలంలో 83, మాడ్గులపల్లి మండలంలో 30, వేములపల్లి మండలంలో 29 ట్యాంకుల నిర్మాణం చేశారు. మిర్యాలగూడ పట్టణం, మండలంలో రూ.75,92,62,000, అడవిదేవులపల్లి మండలంలో రూ.24,53,82,000, దామరచర్ల మండలంలో రూ.29,80,39,000, వేములపల్లి మండలంలో రూ.32,80,83,000, మాడ్గులపల్లి మండలంలో రూ.35.92లక్షలతో ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణం చేశారు.
గత పాలకుల హయాంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మా తలాపున ఉన్నా.. మంచినీటి కోసం తండ్లాడిన పరిస్థితులుండేవి. వేసవిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండేది. ఇంటికి బంధువులు వస్తే నీళ్ల కోసం ఎంతో ఇబ్బంది పడేది. అప్పటి ప్రభుత్వం కంటి తుడుపుగా ఒక ట్యాంకర్ నీటిని పంపించి చేతులు దులుపునేది. ఎన్నోసార్లు రోడ్డెక్కి ధర్నాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేసిన పార్టీ లేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆలోచనతో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో సాగు, తాగునీటి బాధలు తీరాయి. స్వరాష్ట్ర కలలు సాకారమయ్యాయి. మిషన్ భగీరథతో ప్రతి గడపకూ సురక్షిత మంచినీరు అందించి తడారిన మా గొంతులను తడిపిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు.
– కోల నాగమణి, కలాల్వాడ, మిర్యాలగూడ పట్టణం
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటికి కటకట ఉండేది. చేతి పంపుల వద్ద క్యూ కట్టి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. దీని వల్ల పనులకు తీవ్ర ఆటంకం కలిగేది. పిల్లలు, ముసలోళ్లు అందరూ నీళ్లు తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడ్డాం. బోరు, వీధి నల్లాల నీళ్లు కలుషితంగా వచ్చేది. వాటిని తాగి రోగాల పాలయ్యేవాళ్లం.తెలంగాణ రాష్ట్రం వచ్చినంక మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు పెట్టి రోజుకు సరిపడా మంచినీళ్లు అందిస్తున్నారు. దాంతో నీళ్లు తెచ్చుకునే కష్టాలు తొలగిపోయాయి. ఇంట్లో నల్లా తిప్పగానే తాగునీరు వస్తుంది. ఆ నీళ్లు స్వచ్ఛంగా ఉండడంతో వ్యాధులు రాకుండా పోయాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీరు అందించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– లావూడి హుస్సేనమ్మ, లావూడితండా, మిర్యాలగూడ మండలం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక ఇంటింటికీ తాగునీరు అందిస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చారు. చెప్పినవే కాకుండా చెప్పని ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి తెలంగాణలో జనరంజకమైన పరిపాలన అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.330.60 కోట్లతో మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణం, పైపులైన్లు ఏర్పాటు చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నాం. ప్రజలు ఎంతో కాలంగా మంచినీటి కోసం పడుతున్న కష్టాలను పారదోలినం.
– ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు