నార్కట్పల్లి, ఫిబ్రవరి 9 : ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున పార్వతీ రామలింగేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులతో చెర్వుగట్టు క్షేత్రం కిక్కిరిసింది. ప్రభుత్వం తరఫున నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఉత్తరాయణ పుణ్యకాలం, నాగమాస శుద్ధ సప్తమి(రథ సప్తమి) గడియల్లో యాజ్ఞికులు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని ఆచార్యత్వంలో ఆలయ ప్రధానార్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో పరిణయతంతు జరిగింది. తెల్లవారుజామున 2 గంటల నుంచే సుప్రభాత సేవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పారాయణం, అన్నాభిషేక మహానివేదనం నిర్వహించారు. ఉదయం 4:30 గంటలకు మేలతాళాలతో స్వామివారిని నంది వాహనం, అమ్మవారిని గజ వాహనంపై ఎదుర్కోలు నిర్వహించి కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చారు. అనంతరం కల్యాణ మండపం వద్ద సంప్రదాయ బద్ధంగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం, రక్షా సూత్రధారణ, 5:20 గంటలకు జీలకర్ర బెల్లం పెట్టించారు. 5:50 గంటల సుముహూర్తమున త్రినేత్రుడు, పార్వతీ అమ్మవారికి మాంగళ్య ధారణ చేశారు. ఈ ఘట్టాన్ని భక్తులు తనివితీరా తిలకించి పునీతులయ్యారు. సుమారు 500 క్వింటాల పసుపు బియ్యం తలంబ్రాల రూపంలో సమకూరాయి. ఎస్పీ రెమా రాజేశ్వరి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పూజల్లో పాల్గొ న్నారు. వేడుకల్లో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ మల్లికార్జున్రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, సర్పంచ్ బాలకృష్ణ, ఎంపీటీసీ రాజిరెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బి.కృష్ణయ్య, కె.వేణు, ఎం.ప్రభాకర్రెడ్డి, యాదయ్య, శివశంకర్, పి.శ్రీనివాస్, సీహెచ్.యాదగిరి, కె.శ్రీను, డి.శంకరయ్య, బి.దేవేందర్, ఆర్.భిక్షపతి, ఎం.వెంకట్రెడ్డి, సీహెచ్.మల్లేశ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
మార్మోగిన శివనామస్మరణ..
పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివనామ స్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. గట్టుపై కాకుండా గట్టు కింది నుంచి ఘాట్రోడ్డుకు ఇరువైపులా రోడ్లన్నీ భక్తుల రద్దీతో క్షేత్రం కిటకిటలాడింది. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించినట్లు ఆలయ చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి, ఇన్చార్జ్ ఈఓ మహేంద్రకుమార్ తెలిపారు. బారికేడ్లు ఏర్పాటుచేసి స్వామి వారి దర్శనం కల్పిస్తూ తలంబ్రాల బియ్యం పోసేలా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, సీఐ శంకర్రెడ్డి, ఎస్ఐ రామకృష్ణ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున శేషవాహనంపై స్వామివారి సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు రామలింగేశ్వర శర్మ తెలిపారు. సూర్య నమస్కారాలు, అర్చనలు, దీక్ష, రుద్ర హోమాలు, బలిహరణ, రుద్రాభిషేకం, మంత్ర పుష్పార్చన, ఆంజనేయస్వామికి లక్ష తమలపాకులతో పూజలు నిర్వహించనున్నట్లు వివరించారు.