నార్కట్పల్లి, ఫిబ్రవరి 12 : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 14 నుంచి 21 వరకు జరిగే జాతరకు జిల్లా అధికారులు, దేవాలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ గోపురాలు, చుట్టు పక్కల ఉన్న శివుడు, గణపతి విగ్రహాలకు రంగులు వేసి అలంకరిస్తున్నారు.
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాల కల్పనకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. బ్రహ్మోత్సవాలకు సుమారు 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని దేవాలయ సిబ్బంది అంచనా. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ దాసరి హరి చందన అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఘాట్ రోడ్డు వద్ద, గుట్ట కింద రద్దీ ఉన్న ప్రదేశాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులను పూర్తి చేశారు. మంచి నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు.
ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు నల్లగొండలోని రామాలయం నుంచి నగరోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 16న శుక్రవారం రాత్రి(తెల్లవారితే శనివారం17వ తేది) స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 18న ఆదివారం (తెల్లవారితే సోమవారం) స్వామి వారి అగ్నిగుండాలు, 19న సోమవారం(తెల్లవారితే మంగళవారం) దోపోత్సవం, అశ్వవాహన సేవ జరుపుతారు. 20న మంగళవారం రాత్రి మహా పూర్ణావృతి, పుష్పోత్సవం, ఏకాంత సేవలు నిర్వహిస్తారు. 21న బుధవారం సాయంత్రం 4 గంటలకు గజ వాహనంపై చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు పరిపూర్ణం చేస్తారు.
జాతరకు వచ్చే భక్తులకు నార్కట్పల్లి, నల్లగొండ, యాదగిరిగుట్ట, సూర్యాపేట, దేవరకొండ, కోదాడ డిపోల నుంచి ప్రత్యేక బస్తులను నడుపనున్నారు. నార్కట్పల్లి డిపో నుంచి నల్లగొండకు వెళ్లే ప్రతి సర్వీసు చెర్వుగట్టు మీదుగా నడుపనున్నారు. జాతర సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 15 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 100 మంది ఏఎస్ఐలు, 325 మంది పోలీసులు సిబ్బంది మొత్తం 500 మందితో బందోబస్తు నిర్వహించనున్నారు.
గుట్ట పైన, కింద 2 ఔట్ పోస్ట్లను ఏర్పాటు చేస్తున్నారు.
గుట్ట పైకి వృద్ధులు, చిన్న పిల్లలను చేరవేసేందుకు 5 ఆటోలను మాత్రమే అనుమతిస్తారు. సీసీ కెమెరాల ఫుటేజీలను చూసేందుకు 2 ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. 2 డ్రోన్ కెమెరాలతో గుట్ట పరిసరాలను పర్యవేక్షించనున్నారు. నీటి వసతి, పారిశుధ్యం, మరుగుదొడ్లు, రవాణా తదితర వసతులపై ప్రత్యేక దృష్టి సాధించామని, స్వామి వారి కల్యాణం, తలంబ్రాల బియ్యం సేకరణలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ నవీన్ తెలిపారు.