చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున పార్వతీ జడల రామలింగేశ్వరుల స్వామి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ప్రభుత్వ తరఫున కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కల్యాణ తంతును ముందుండి నడిపించారు. ఉదయం 4:30 గంటలకు మేళతాళాలతో స్వామి వారిని నంది వాహనంపై, అమ్మవారిని గజ వాహనంపై ఎదుర్కోలు నిర్వహించి కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చారు. వేద మంత్రాల నడుమ రూ.5:50 గంటలకు మాంగళ్య ధారణ ఘట్టం జరుగగా భక్తులు తనివి తీరా తిలకించి పునీతులయ్యారు. పరిణయ శోభతో మనోహరంగా దర్శనమిచ్చిన ఆది దంపతులకు భక్తులు తలంబ్రాలు సమర్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో చెర్వుగట్టు కిక్కిరిసిపోయింది. శివసత్తుల నృత్యాలు, భక్తిపాటలు, శివనామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. సోమవారం తెల్లవారుజామున శేషవాహనంపై స్వామివారి సేవ నిర్వహించనున్నారు.
నార్కట్పల్లి, జనవరి 29 : ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున పార్వతీ జడల రామలింగేశ్వరుల కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్రభుత్వం తరఫున కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి స్వామి, అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆయనతోపాటు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కల్యాణ తంతును ముందుండి నడిపించారు. భక్తులతో చెర్వుగట్టు క్షేత్రం కిక్కిరిసింది. శివ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. శివసత్తుల కోలాటాల మధ్య ఉత్తరాయణ పుణ్యకాలం, మాఘమాస శుద్ధ సప్తమి (రథసప్తమి) గడియలలో యాజ్ఞీకులు అల్లవరపు సుబ్రమణ్య దీక్షితావధాని ఆచార్యత్వంలో ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు నీలకంఠ శివాచార్యుల వ్యాఖ్యానం కట్టి పడేస్తుండగా రుత్వికుల వేద మంత్రాల మధ్య పరిణయ తంతు జరిగింది.
తెల్లవారుజామున 2గంటల నుంచే సుప్రభాత సేవ మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పారాయణం, అన్నాభిషేక మహానివేదనం నిర్వహించారు. ఉదయం 4:30గంటలకు మేళతాళాలతో శివ సత్తుల నాట్యాల నడుమ స్వామివారిని నంది వాహనంపై, అమ్మవారిని గజ వాహనంపై ఉంచి ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను కల్యాణ మండపానికి తోలుకొని వచ్చారు. సువర్ణ పుష్పాది బిల్యాలతో దివ్యాలంకరణతో శోభితమైన కల్యాణ వేదికలో పద్మాసనంపై ఉత్సవమూర్తులను ఆసీనులు గావించి సప్తనదీ జలాలతో కూడిన మంత్రజలాన్ని చల్లి కల్యాణ వేదికను శుద్ధి చేశారు. బ్రహ్మ, విష్ణువు, ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. అనంతరం కల్యాణ మండపం వద్ద సాంప్రదాయబద్ధంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాసూత్రాధరణ, 5:20గంటలకు జీలకర్ర, బెల్లం పెట్టించారు. అమ్మవారికి రక్షా సూత్రాధరణ చేశారు.
జగత్ రక్షకుడైన పరమేశ్వరుడి గొప్పతనం వృత్తాంతాన్ని వివరించి మాంగళ్యం తంతునానే లోకరక్షణాహేతునాం అంటూ యాజ్ఞీకులు మంత్రాలు పఠిస్తుండగా 5:50గంటలకు త్రినేత్రుడు పార్వతీ అమ్మవారికి మాంగళ్యధారణ చేశారు. ఈ ఘట్టాన్ని భక్తులు తనివితీరా తిలకించి పునీతులయ్యారు. పరిణయ శోభతో మనోహరంగా దర్శనమిచ్చిన ఆది దంపతులకు తలంబ్రాలను సమర్పించుకున్న భక్తులతో వేదిక కిక్కిరిసిపోయింది. దాదాపు 500 క్వింటాళ్ల పసుపు బియ్యం తలంబ్రాల రూపంలో సమకూరాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్, ఆలయ ఇన్చార్జి ఈఓ నవీన్, దేవాలయ సిబ్బంది సకల వసతులు కల్పించారు. కల్యాణ వేడుకలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, ఇన్చార్జి తాసీల్దార్ మురళి, ఎంపీడీఓ యాదగిరి, సినీ దర్శకుడు ఎన్.శంకర్, సర్పంచ్ మల్గ బాలకృష్ణ, ఎంపీటీసీ రాజిరెడ్డి, చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూరు శంకర్, నార్కట్పల్లి ఎంపీటీసీ పుల్లెంల ముత్తయ్య, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
శివనామస్మరణతో మార్మోగిన క్షేత్రం
పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచీ భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. గట్టు పైన, కింది నుంచి ఘాట్ రోడ్డుకు ఇరువైపులా రద్దీ నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన స్వామివారి కల్యాణానికి భక్తులు సమర్పించిన కట్నాలు రూ.6,18,725 వచ్చినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ నవీన్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా మౌలిక వసతులు కల్పించినట్లు దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్, ఆలయ ఇన్చార్జి ఈఓ నవీన్ తెలిపారు. బారికేడ్ల సహకారంతో స్వామివారి దర్శనం కల్పిస్తూ తలంబ్రాల బియ్యం పోసేలా చర్యలు తీసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ నర్సింహారెడ్డి, సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
చెర్వుగట్టు దేవస్థానం భవిష్యత్తులో ప్రముఖ యాత్రా స్థలాల్లో ఒకటిగా వెలుగొందనున్నదని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో వేములవాడ, యాదగిరిగుట్ట తరువాత అతి పెద్దదైన చెర్వుగట్టు దేవస్థానాన్ని ముఖమంత్రి కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
నేడు శేషవాహనంపై స్వామివారి సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున శేషవాహనంపై స్వామివారి సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ తెలిపారు. సూర్య నమస్కారాలు, గవ్వంత అర్చనలు, దీక్షా హోమం, రుద్ర హోమం, బలిహరణం, వేదస్వస్తి, రుద్రాభిషేకం, నీరాజన మంత్ర పుష్పార్చన, ఆంజనేయస్వామికి లక్ష తమలపాకులతో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.