భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. మామిడి తోరణాలు, రంగుల కాగితాలు కట్టి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను ముస్తాబు చేశారు. ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో వేడుకలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, వివిధ వర్గాలకు ఆస్తుల పంపిణీ చేయనున్నారు. సోమవారం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ కె.అపూర్వరావు పరిశీలించారు.
– నీలగిరి/రామగిరి, ఆగస్టు14
నీలగిరి/ రామగిరి, ఆగస్టు 14 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ముఖ్య అతిథిగా మంగళవారం ఉదయం 11 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 11:30 గంటలకు ప్రభుత్వ ప్రగతి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించనున్నారు.
ఆ తర్వాత ఆయా శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల అందజేత, శకటాల ప్రదర్శన ఉంటుంది. 11:40 గంటలకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, 12గంటలకు ఆస్తుల పంపిణీ, 12:15కు ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు. 12:30 గంటలకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమాలు ముగుస్తాయి. పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు సోమవారం పరిశీలించారు. జెండావిష్కరణ చేసే ప్రాంతంతోపాటు ప్రముఖులు కూర్చునే, పట్టణ ప్రజలు ఉండే స్థలాలను పరిశీలించారు. జెండావిష్కరణ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు.