డిపోల వారీగా ఆర్టీసీ ఉద్యోగులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో పని చేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన క్యాబినేట్ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఈ నెల మూడున శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించనున్నట్లు తెలిపింది. దాంతో టీఎస్ ఆర్టీసీ
ఉద్యోగులంతా ప్రభుత్య ఉద్యోగులు కానున్నారు. సర్కారు నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,479 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఇక్కడ మొత్తం 7 డిపోలు ఉండగా వాటి పరిధిలో పని చేసే అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, వర్కర్లు, మెకానిక్లు, కంట్రోలర్స్ ఇక ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే వేతనాలు, సౌకర్యాలు పొందనున్నారు. వారంతా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, జూలై 31 (నమస్తే తెలంగాణ)
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ)లో పని చేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని ప్రకటించింది. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, ఆగస్టు 3న శాసన సభలో విలీనానికి సంబంధించిన బిల్లును పెట్టి ఆ సంస్థ ఉద్యోగులను రెగ్యులర్ చేయనున్నది. బిల్లు ఆమోదం అనంతరం ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ నిర్ణయంపై ఆనందంగా ఉన్నారు. తాజా నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 2,479 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఆర్టీసీలో కింది స్థాయిలో పని చేసే ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు క్రమబద్ధీకరణ జరుగనున్నది. ఉమ్మడి జిల్లాలో ఏడు ఆర్టీసీ డిపోలు ఉండగా ఆయా డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు, వర్కర్లు, మెకానిక్స్, కంట్రోలర్స్లతోపాటు అధికారులకు ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వేతనాలు అందనున్నాయి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏండ్ల తరబడి ఆ సంస్థ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారంతో ఫుల్స్టాప్ పెట్టింది. రాష్ట్ర సాధన తర్వాత ఆదాయ మార్గాలను దృష్టిలో పెట్టుకొని విడతల వారీగా ఆయా వింగ్లను రెగ్యులర్ చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని ప్రకటించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,479 మంది ఉద్యోగులు ఇక రెగ్యులర్ కానున్నారు. అత్యధికంగా నల్లగొండ డిపోలో 497 మంది ఉద్యోగులు ఉండగా, దేవరకొండ 428, కోదాడ 276, యాదగిరిగుట్ట 429, సూర్యాపేట 398, మిర్యాలగూడ 379, నార్కట్పల్లిలో 72 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కింది స్థాయిలో స్వీపర్ల నుంచి పై స్థాయిలో పని చేసే కంట్రోలర్ వరకు ఉండగా వీరందరి ఉద్యోగాలు త్వరలో రెగ్యులర్ కానున్నాయి. ఆగస్టు 3వ తేదీన శాసన సభలో బిల్లు ఆమోదం పొందిన దగ్గరి నుంచి వీరంతా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడనున్నారు.
ప్రజాకాంక్షకు అనుగుణంగా ఉద్యమ సారథిగా రెండు సార్లు అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ ఉద్యమంలో ప్రధాన నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఈ మూడు నినాదాల్లో ఒకటైన నియామకాలపై ఇప్పటికే దృష్టి సారించి భర్తీ ప్రక్రియ షురూ చేసిన ప్రభుత్వం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, తాత్కాలిక పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో ఆదాయ మార్గాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కాంట్రాక్ట్ లెక్చరర్స్, వైద్య ఉద్యోగులు, వీఆర్ఓలు, వీఆర్ఏలను క్రమబద్ధీకరించిన ప్రభుత్వం తాజాగా ఆర్టీసీ ఉద్యోగులను సైతం రెగ్యులర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా.. ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షాలు, కొన్ని యూనియన్లు ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారని, ఆస్తులు అమ్మేస్తారని ప్రచారం చేశారు. వారి ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ సంస్థను ప్రభుత్వ పరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో కార్మికులందరికీ భరోసా లభించింది. కార్పొరేషన్ వల్ల ఎన్నో కష్టాలు పడ్డాం. సీఎం కేసీఆర్ దయ వల్ల ఈరోజు మా కష్టాలు తీరాయి. కార్మికుల కుటుంబ సభ్యులు, కార్మికులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– పరిమి రామావతారం, రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం(బీఆర్టీయూ)
నిజమైన నాయకుడు సీఎం కేసీఆర్
గతంలో ఉన్న ఏ నాయకుడు తీసుకోలేని నిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకోవడం అభినందనీయం. ఇలాంటి నా యకుడు ప్రజలకు, ఉద్యోగులకు ఎంతైనా అవసరం ఉంది. ఈ నిర్ణయంతో వేల మంది ఉద్యోగులకు దారి చూపిన మహనీయుడుగా చరిత్రలో నిలిచిపోనున్నారు. కానీ కేసీఆర్ లాంటి నాయకుడితో ఏదైనా సా ధ్యం అవుతుందని మరోసారి నిరూపణ అయింది.
– సుంకరి శ్రీనివాస్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ హైదరాబాద్ జోన్ జాయింట్ సెక్రటరీ
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం హర్షనీయం. ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న మా కల సీఎం కేసీఆర్ సహకారంతో నెరవేరింది. రవాణా వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగావుంది. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– సీహెచ్.నర్సింహ, టీఎంయూ వైస్ ప్రెసిడెంట్
ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తూ నిర్ణయం తీసుకున్న ఈ రోజు మా జీవితంలో మర్చిపోలేము. కార్మికుల కష్టాల గుర్తించి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని సదుపాయాలు కల్పించాలని నిర్ణయించడం గొప్ప విషయం. 30 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పని చేసినప్పటికీ గత పాలకులు ఎవరూ మమ్ములను గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించి ఆదరించిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– కోట్యానాయక్, ఆర్టీసీ కండక్టర్, దేవరకొండ డిపో
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు ఆర్టీసీ ఉద్యోగులంతా రుణపడి ఉంటాం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కార్పొరేషన్ను నేడు గుర్తించిందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. చిత్తశుద్ధితో పనిచేసే ఇచ్చిన మాట మేరకు ఆర్టీసీ రంగాన్ని లాభాల బాటలో తీసుకొచ్చి ప్రభుత్వానికి బాసటగా ఉంటాం.
– యాసిన్ అలీ, టీఎంయూ సెక్రటరీ నార్కట్పల్లి
తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
– షేక్ అబ్బుల్ రహీం, కండక్టర్, కోదాడ డిపో