నీలగిరి, ఫిబ్రవరి 5 : నల్లగొండ మున్సిపల్ చైర్మన్గా 32వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్రెడ్డి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్గా ఉన్న మందడి సైదిరెడ్డిపై అవిశ్వాసం పెట్టి నెగ్గించడంతో చైర్మన్ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 48 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్అఫిషియో సభ్యులు కలిపి 50 మంది సభ్యులకు ఓటు హక్కును కల్పించారు.
ఈ నేపథ్యంలో చైర్మన్ ఎన్నికకు 45 మంది కౌన్సిలర్లు (కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంతోపాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సభ్యులైన ఫ్లోర్లీడర్ అభిమన్యు శ్రీనివాస్, యామ కవితారాణి), ఒక ఎక్స్అఫిషియో సభ్యుడు హాజరయ్యారు. బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు(మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, 7వ కౌన్సిలర్ మారగోని భవానీగణేశ్, 27వ వార్డు కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్)తోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి గైర్హాజరయ్యారు.
ఎన్నికల పక్రియను ఎన్నికల అధికారి, మిర్యాలగూడ ఆర్డీఓ బి.చెన్నయ్య చేపట్టగా మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయిన బుర్రి శ్రీనివాస్రెడ్డిని ప్రతిపాదిస్తూ14వ వార్డు కౌన్సిలర్ బొజ్జ శంకరయ్య తీర్మానం ప్రవేశ పెట్టారు. 23వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ మహబూలీ అలీ(ఇంతియాజ్) తీర్మానాన్ని బలపర్చారు. చైర్మన్కు మిగతా సభ్యులు ఎవరు కూడా పోటీలో లేకపోవడంతో బుర్రి శ్రీనివాస్రెడ్డిని చైర్మన్గా ప్రకటిస్తూ ఎన్నికల అధికారి బి. చెన్నయ్య నియామక పత్రాన్ని అందజేశారు.
అనంతరం బుర్రి శ్రీనివాస్రెడ్డిని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కలెక్టర్ హరిచందన దాసరి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్నాయక్తోపాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలిపి సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి, అదనపు కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
మీనార్ నిర్మాణానికి మంత్రి విరాళం
చిట్యాల : మండలంలోని గుండ్రాంపల్లి ఈద్గా నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రూ. 50వేల విరాళం అందజేశారు. సోమవారం పంతంగి టోల్ ప్లా వద్ద మజీద్ కమిటీ బాధ్యులు మంత్రిని కలువడంతో ఆయన కమిటీ అధ్యక్షుడు ఎండీ జహంగీర్కు ఈ విరాళాన్ని అందజేశారు. గతంలో వెంకట్రెడ్డి సొంత డబ్బులు రూ. లక్ష ఇచ్చినట్లు జహంగీర్ తెలిపారు. ఈ సందర్భంగా రూ. 15 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ దోర్నాల రామచంద్రం, ఎంపీటీసీ దుబ్బ పద్మాకుమారస్వామి, విజయ్కుమార్, ఎండీ జబ్బార్, ఫకీర్, గాలిబ్ఖాన్, సాజీద్ పాల్గొన్నారు.