నీలగిరి, ఫిబ్రవరి 16: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ మేయర్గా అష్రఫ్ అలీ మహ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఎన్నికల అధికారి శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కార్పొరేషన్ పరిధిలోని 48 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మేయర్ ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. మేయర్గా 32వ డివిజన్ కార్పొరేటర్ బుర్రి చైతన్యను, 16వ డివిజన్ కార్పొరేటర్ పెరిక స్వాతి ప్రతిపాదించగా, 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్చంద్రబోస్ బలపర్చారు. ఇతర పక్షాల నుంచి ఎవరూ పోటీలో లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించి, చైతన్యతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం డిప్యూటీ మేయర్గా 45వ డివిజన్ కార్పొరేటర్ అష్రఫ్ అలీ మహ్మద్ను 41వ డివిజన్ కార్పొరేటర్ కేసారి వేణుగోపాల్రెడ్డి ప్రతిపాదించగా 30వ డివిజన్ కార్పొరేటర్ మారగోని నవీన్గౌడ్ బలపర్చారు. ఇతర పక్షాల నుంచి ఎవరూ పోటీలో లేపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించి అష్రఫ్ అలీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఏకగ్రీవం కావడం నగర అభివృద్ధికి సంకేతం..
నల్గొండ మేయర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నగర అభివృద్ధికి మంచి సంకేతమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నంత కాలం కార్పొరేటర్లు అంకిత భావంతో పట్టణ ప్రజలకు సేవ చేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు పట్టణ ప్రజలకు మంచి సేవలు అందించి పేరు తెచ్చుకోవాలన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్పొరేటర్లపై ఉందని అన్నారు. అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయాలన్నారు.
పట్టణ ప్రజలకు మేలు చేస్తా: మేయర్
తనపై నమ్మకం ఉంచి మేయర్గా బాధ్యతలు అప్పగించినందుకు పట్టణ ప్రజలకు సేవ చేస్తానని నూతన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, ఆఫన్ అలీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ , మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర తదితరులు ఉన్నారు.