హాలియా, మార్చి 31 : జనగాం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం బస్సు యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా నిడమనూరు మండలం వేంపాడుకు వస్తున్నారని సమాచార ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గ రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంతోషపడ్డారు.
తమ అభిమాన నాయకుడు, రైతు బాంధవుడిని చూసేందుకు, ఆయనను కలిసి తమ గోడును చెప్పుకునేందుకు వేంపాడు గ్రామానికి రైతులు స్వచ్ఛందంగా, తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డు పైన, చెట్ల నీడలో నిలబడ్డారు.
తుంగపహాడ్, త్రిపురారం, ముకుందాపురం, బొక్కమంతులపహాడ్లో కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు గ్రామస్తులు, రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు. ముందుగా జనగాం, సూర్యాపేట జిల్లాల్లో చేపట్టిన కేసీఆర్ పర్యటనకు రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రైతులు కేసీఆర్ను కలిసి తమ ఇబ్బందులను చెప్పుకునే క్రమంలో సమయమంతా అక్కడే సరిపోయింది. సూర్యాపేట ప్రెస్మీట్ అనంతరం వేంపాడుకు రావాల్సి ఉంది.
కానీ, అక్కడే ఆలస్యం కావడం, ఇక్కడికి వచ్చే సరికి చీకటిపడుతుండటం, మళ్లీ బస్సులో కేసీఆర్ 150 కిలోమీటర్లు హైదరాబాద్కు వెళ్లాల్సి ఉండటంతో చివరి నిమిషంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దాంతో రైతులు నిరాశ చెందారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక తమను నిండా ముంచారని పేర్కొన్నారు.
యాసంగిలో పంట చేతికి వస్తున్నా నేటికీ రైతుబంధు పూర్తిగా ఇవ్వలేదని, 2 లక్షల రుణమాఫీ చేయలేదని వాపోయారు. నాగార్జునసాగర్ డ్యామ్లో 520 అడుగుల మేర నీళ్లు ఉన్నప్పటికీ పంటలను కాపాడేందుకు ఒక్క తడి నీళ్లు ఇవ్వమన్నా ప్రభుత్వం ఇవ్వలేదని, ప్రభుత్వ వైఫల్యం వల్లే నేడు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, ఓటేసి గెలిపించిన పాపానికి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని ఈ సందర్భంగా రైతులు వాపోయారు.