యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే భువనగిరి ఖిలాపై గులాబీ జెండా ఎగురాలని, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయాలంటే ప్రశ్నించే గొంతుకలను ఎన్నుకోవాలని కోరారు. భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. దీనికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ 2014లో పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించుకున్న స్ఫూర్తితోనే 2024లోనూ గెలిపించాలన్నారు. నలభై రోజులు కష్టపడితే భువనగిరిలో భారీ విజయం మనదేనని చెప్పారు. అసెంబ్లీలో కొట్లాడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ సాధించాలన్నారు. గట్టిగా పనిచేద్దామని, కష్టకాలంలో ఉన్న కార్యకర్తలనే నాయకులుగా చేసుకుందామని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ మోసాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. మహిళలు, రైతులకు మోసాలను విడమర్చి చెప్పాలన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు.
బలహీన వర్గాల నేత క్యామ మల్లేశ్
‘భువనగిరిలో పోటీ చేస్తున్న క్యామ మల్లేశ్ బలహీన వర్గాల నేత. బీసీల కోసం ఎంతో చేశారు. ఎన్నో ఏండ్ల రాజకీయ అనుభవం ఉంది. వివాదరహితుడు, సౌమ్యుడు. ఆయనను పార్లమెంట్కు పంపాలి’ అని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పారు. కాంగ్రెస్ అక్రమ కేసులకు భయపడేది లేదని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా లీగల్ టీమ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ ఉన్నంత కాలం, భూమి ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటుందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, చింతల వెంకటేశ్వరరెడ్డి, పాల్వాయి స్రవంతి రెడ్డి, సూదగాని హరిశంకర్ గౌడ్, జడల అమరేందర్, కొలుపుల అమరేందర్, ఎనబోయిన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్గా నిలిపిన కేసీఆర్
సుదీర్ఘ పోరాటం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడంతో పాటు పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే రోల్ మోడల్గా నిలిపారు. ప్రస్తుతం కేవలం 1.8 శాతం ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్లో కేవలం ఆరుగురు మాత్రమే మొదటి నుంచి ఉన్నవారున్నారు. మిగతా వారంతా మంత్రి పదవులు కొనుక్కున్న వారే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రైతుబంధు బంద్, 24 గంటల కరెంట్ బంద్, కల్యాణలక్ష్మి బంద్, నీళ్లు బంద్ అయినై.. చివరికి కాంగ్రెస్సే బంద్ అయ్యే పరిస్థితి వస్తది. దేశంలో కాంగ్రెస్ బలహీన పడుతోంది. రేవంత్రెడ్డి, చంద్రబాబుతో కలిసి చివరకు కేంద్రంలోని మోడీతో కలిసి పోవడం ఖాయం. రేవంత్రెడ్డి బీజేపీతో జత కూడితే తెలంగాణ రాష్ట్రంలో ఇక అభివృద్ధి శూన్యం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని ఎంపీ సీట్లను అన్ని వర్గాల ప్రజలకు అందించి సమన్యాయం చేసింది. మాజీ సీఎం కేసీఆర్ యాదాద్రిలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించి, దేశంలోనే ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా తీర్చి దిద్దారు. కుల మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే వారిని ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నాకు ఓటు వేసి గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తా.
– క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి
బీఆర్స్ సర్కారులో ప్రభుత్వం సొమ్ము ముట్టని గడప ఉందా
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు అందని, స రారు సొమ్ము ముట్టని గడప ఉందా. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కేసీఆర్ అగ్రస్థానంలో నిలిపిండు. నాడు సరారు సొమ్ము అందని గడప లేదు. కాంగ్రెస్ చెప్పిన మాటలకు మోసపోయి రైతులు, ప్రజలు ఇప్పుడు గోసపడుతుండ్రు. దేశంలో బీజేపీ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేయడం తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీలేదు.
– మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
కష్టపడి క్యామ మల్లేశ్ను గెలిపించుకుందాం
బీఆర్ఎస్ సర్కారులోనే ప్రజలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ప్రజలు మోసపోయారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలు చేయలేకపోతున్నది. ఆ పార్టీ మోసాలను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు వివరించాలి. కలిసి కట్టుగా పనిచేసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం.
– మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం
ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యపడుతుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారు ఓటు వేసినా బీఆర్ఎస్కు విజయం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు.
– జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి
దొంగల ముఠాను దూరం పెట్టాలి
రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన దొంగల ముఠా నాయకులను దూరం పెట్టాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మరిచి డబ్బుల మూటలను జమ చేసి ఢిల్లీకి అప్పగించే బాధ్యత కాంగ్రెస్ది కాదా. కేసీఆర్ ఒకరోజు ఇంటి నుంచి రైతుల వద్దకు వెళ్తే కాళేశ్వరం, నాగార్జునసాగర్ నుంచి నీళ్లు విడుదల చేసిండ్రు. రైతుల సంక్షేమానికి మరో ఉద్యమం చేపట్టడానికి అంతా సిద్ధంగా ఉండాలి.
-మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
ఎన్నికల ముందు ప్రజలకు అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 11సార్లు రైతుబంధు వేసి 12వ విడుత రైతు బంధు నగదును బ్యాంకులో పెట్టగా కాంగ్రెస్ కుట్రతో అకడే ఆగిపోయింది. జలాశయాల్లో నీళ్లున్నా వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను ఎండబెట్టింది. రైతుబంధు ఇవ్వక అన్నదాతలను గోస పెడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల కరెంట్, నీళ్లు ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు. తెలంగాణ రాక ముందు 30 నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మూడు కోట్ల మెట్రిక్ టన్నులకు చేరింది. వ్యవసాయ రంగంలో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్దే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేలు, వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇప్పటికీ ఇవ్వలేక బోగస్ మాటలు చెబుతూ కాలం గడుపుతున్నది.
-జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
కేసీఆర్ హయాంలోనే అన్ని రంగాల అభివృద్ధి
మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ప్రతినిత్యం ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ కష్టపడితే అనుక్షణం ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతున్నది. అధికార వ్యామోహంతో ప్రజలకు మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచింది. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వంపై మూడు, నాలుగు నెలల్లో ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. మరలా కేసీఆర్ పాలన రావాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి.
-మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కాంగ్రెస్ మోసాలు నాలుగు నెలల్లో బయటపడ్డాయి
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. నాలుగు నెలలు గడిచినా ఇచ్చిన అమలు చేయడం లేదు. ఆ పార్టీ మోసాలు, అబద్ధాలు బయటపడ్డాయి. నీళ్లు లేవు, 24 గంటల కరెంట్ లేదు. రైతు బంధు ఇవ్వలె, రుణమాఫీ చేయలె. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
-మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఆ వ్యతిరేకతతోనే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు. పది సంవత్సరాల్లో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిలబెట్టారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు వచ్చింది. నిధుల్లేక అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ప్రజల పక్షాన నిలిచేది బీఆర్ఎస్ మాత్రమే. క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.
-మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
కేసీఆర్ అడుగుతో అలజడి పుట్టింది
మాజీ సీఎం కేసీఆర్ ఒక అడుగుతోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో అలజడి పుట్టింది. అధికారం వచ్చిన తర్వాత అహంకారంతో ఇచ్చిన హామీలు పక్కన పెడితే ప్రజలే బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకు జనం ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఓటుతో దెబ్బ కొట్టడానికి ఎదురుచూస్తున్నారు.
-మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య