మిర్యాలగూడ, నవంబర్ 28 : మిర్యాలగూడ నియోజకవర్గంలో పదేండ్లుగా అనేక అభివృద్ధి పనులు చేశానని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధిని కొనసాగించేందుకు తనను మరో మారు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు కోరారు. మంగళవారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ పదేండ్ల కాలంలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని 119 గ్రామపంచాయతీలను, మిర్యాలగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుకు తీసుపోయానన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 90 శాతానికి పైగా సీసీ రోడ్లు, బీటీరోడ్లు నిర్మించినట్లు చెప్పారు. అర్హులైన లబ్దిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించానని పేర్కొన్నారు. వజీరాబాద్, ముదిమాణిక్యం మేజర్ల పరిధిలో బీళ్లు పడిన చివరి భూములకు సాగునీరు అందించేందుకు ఐదు లిఫ్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1000కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. వీటిలో మూడు లిఫ్ట్ల పనులు ఇప్పటికే మొదలయ్యాయని, మరో రెండు లిఫ్టులు టెండర్ దశలో ఉన్నాయని వివరించారు. మరో మారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే లిఫ్టుల నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
రూ.30వేల కోట్లతో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని, ఇది కూడా త్వరలో పూర్తి కానుందని తెలిపారు. ఈ ప్లాంట్లో స్థానికులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 2014 నుంచి 2023 వరకు రూ.4,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. గత 50 ఏండ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్నవారు చేసిన అభివృద్ధిని.. ఈ పదేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని నియోజకవర్గ ప్రజలు పోల్చి చూడాలని సూచించారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేల భృతి అందిస్తామని, తెల్ల రేషన్ కార్డుదారులందరికీ అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. పేద కుటుంబాలకు రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆసరా పింఛను రూ.5,016కు, వికలాంగుల పింఛను రూ.6,016కు పెంచుతామన్నారు. కేసీఆర్ ఆరోగ్య రక్ష ద్వారా రూ.15లక్షల ఆరోగ్య బీమా అందిస్తామన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల అభివృద్ధి చేయడం ద్వారా గ్రామాల్లో భూ గర్భజలాలు గణనీయంగా పెరిగాయన్నారు. దాంతో రైతులు పంటలు పండించుకోవడమే కాకుండా రైతు కూలీలకు మంచి ఉపాధి లభిస్తున్నదని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు ఇప్పుడిస్తున్న రూ.10వేలను రూ.16వేలకు పెంచడం వల్ల రైతులకు లబ్ధి చేకూరనున్నదని పేర్కొన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలు, తండాలు, మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. సంక్షేమ పథకాలు అందాలంటే మరోసారి బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దే అని, ఆయనను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు, మిర్యాలగూడలో మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆదరించాలని కోరారు.