– చింత్రియాల గ్రామ సమీపంలోని ఘటన
– మృతులు సమీర్ (15), సద్దాం (13)
చింతలపాలెం, మార్చి 11 : బర్రెలను మేపేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు కృష్ణానదిలో జారిపడి మృతి చెందిన విషాద సంఘటన చింతలపాలెం మండలంలోని చింత్రియాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింత్రియాల గ్రామానికి చెందిన సైదు హుస్సేన్ ఇద్దరు కుమారులు సమీర్ (15), సద్దాం (13) లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఉర్దూ మీడియం మాదర్సా పాఠశాలలో చదువుతున్నారు. రంజాన్ సెలవులు రావడంతో స్వగ్రామమైన చింత్రియాల గ్రామానికి వచ్చారు. ఈ సెలవు రోజుల్లో అన్నదమ్ములు ప్రతిరోజులాగే మంగళవారం బర్రెలను మేపేందుకు కృష్ణానది ఒడ్డుకు వెళ్లారు. బర్రెలకు నీరు తాగించేందుకు కృష్ణానది దగ్గరికి తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా సద్దాం జారి నదిలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు అన్న సమీర్ కూడా వెంటనే నదిలోకి దిగాడు. అయితే నది లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు.
ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, మత్స్యకారులు కలిసి చాలా సేపు నదిలో వెతికారు. అయినప్పటికీ మంగళవారం మృతదేహాలు లభ్యం కాలేదు. బుధవారం ఎన్.డి.ఆర్.ఎఫ్ బృంధం, మత్స్యకారులు, స్థానికులు, పోలీసులు నదిలో సహాయక చర్యలు చేపట్టి ఇరువురి మృతదేహాలను బయటకు తీశారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో దుఃఖ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నది దగ్గరికి వెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.