భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 3: మండలం లోని రాయగిరి పరిధిలోని స్టేషన్ రాయగిరి సమీపంలో కొండపై వేంచేసి ఉన్న పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. పూర్వం నుంచి రాయగిరి గ్రామంలోని వేంకటేశ్వర ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా స్టేషన్ రాయగిరి వద్దనున్న కొండపైకి తీసుకెళ్లి ఐదు రోజుల పాటు కల్యాణం, రథోత్సవం, చక్రతీర్థం, శతఘటాభిషేం తదితర కార్యక్రమాల అనంతరం తిరిగి ఊరేగింపుగా రాయగిరికి చేరుకోవడం ఆనవాయితీ. ఉత్సవాల్లో మం డలంలోని వివిధ గ్రామాలతోపాటు యాదగిరిగుట్ట, భువనగిరికి చెందిన వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారి సేవలో తరిస్తారు.
ఐదు రోజులపాటు జరిగే కార్యక్రమాలు..
పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాయగిరిలో ఈనెల 4 నుంచి 8 వరకు ఐదు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4న శనివారం సాయంత్రం రాయగిరి గ్రామంలోని ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను సమీపంలోని కొండపైన ఉన్న ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. 5వ తేదీ రాత్రి 9:30గంటలకు స్వామివారి కల్యాణం. 6న రాత్రి 9:30గంటలకు దివ్యవిమాన రథోత్సవం. 7వ తేదీ మధ్యాహ్నం చక్రతీర్థం, 8న బుధవారం మధ్యాహ్నం శతఘటాభిషేకం,సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపుతో రాయగిరి గ్రామంలోని వేంకటేశ్వర ఆలయానికి తీసుకువస్తారు.
సుందరంగా మెట్లబావి
రాయగిరి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవా దాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తు న్నారు. ఆలయ ప్రాంగణంలోని మెట్లబావిని పూర్తిస్థాయిలో ఆధునీకరించి అందంగా తీర్చిదిద్దారు. మెట్లబావి వద్ద గ్రీనరీ, విద్యుత్ సౌకర్యం, నీటి వసతితో పాటు భక్తులకు మౌలిక వసతుల కల్పనకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు.