యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 12 : స్వయంభూ పంచనారసింహుడిగా కొలువుదీరిన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రారండంటూ ముక్కోటి దేవతలకు ఆహ్వానం అందింది. ఉత్సవాల్లో రెండోరోజైన మంగళవారం ఉదయం స్వామివారికి నిత్య కైంకర్యాల అనంతరం బ్రహ్మోత్సవాల్లో ఆదిపూజ అయిన ధ్వజారోహణం అత్యంత వైభవంగా చేపట్టారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి దేవతలందరిని ఆహ్వానించడానికి గరుత్మంతుడిని వియుక్తం చేసే ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణానికి అర్చకులు, వేదపండితులు, రుత్వికులు, పారాయణందార్లు, యాజ్ఞిక బృంద సభ్యులు శ్రీకారం చుట్టారు.
ముందుగా ప్రధానాలయం వెలుపలి ప్రాకారంలోని అద్దాల మండపంలో యాగశాల ప్రవేశం, ద్వారతోరణం, ధ్వజ కుంభారాధన, మహా కుంభారాధన, చతుస్థానార్చన నిర్వహించారు. అనంతరం అగ్నిప్రతిష్ఠ, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు గావించారు. ప్రత్యేకంగా గరుఢ అధివాసం, గరుఢ హోమం, పాంచరాత్రగమ శాస్త్రరీతిలో పూర్ణాహుతి చేపట్టారు. ప్రధానాలయం ముఖ మండపంలో ధ్వజ స్తంభంపై ధ్వజారోహణం అనంతరం అష్టదిగ్పాలక బలిహరణ కార్యక్రమం చేశారు.
స్వామివారి కల్యాణోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి మహావిష్ణువుకు ఇష్టమైన వాహనం గరుత్మంతుడిని కొలిచారు. గరుడాళ్వార్ల చిత్రపటం వద్ద పట్టువస్ర్తాలు, వజ్రవైఢూర్యాలు, ముత్యాల ఆభరణాలతో అలంకరించిన స్వామి, అమ్మవార్లను వేదికపై అధిష్టింపజేసి వేదమంత్రాలతో దేవతలను అర్చించారు.
గరుత్మంతుడి పటాన్ని శ్వేత ధ్వజ పతాకంపై చిత్రించి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ గరుఢ పతాకాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోపణ చేశారు. ధ్వజ దండాన్ని పూజించి తెల్లని వస్త్రంపై గరుత్మంతుడిని చిత్రించి 27 విధాలైన ఉపచారములతో ఆరాధన చేసి, చతుర్వేదములతో దేవతలను ఆవాహన చేశారు. గరుత్మంతుడు ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన గరుఢ మద్దులను పైకి ఎగురవేసి పూజలు చేశారు. వివిధ ప్రక్రియల్లో విశేషమైన పూజలతో గురుఢ ధ్యానం గావించి ముద్దల ప్రసాద నివేదన చేశారు. ఈ గరుఢ మద్దుల స్వీకరిస్తే సౌభాగ్యం, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు పోటీపడి అందుకున్నారు. అనంతరం స్వామివారికి నివేదిన, తీర్థప్రసాదాల గోష్టి కార్యక్రమం నిర్వహించారు.
స్వామివారి వారి ప్రధానాలయంలో నిత్యారాధనల అనంతరం జరిపిన దేవతాహ్వానంలో సాయంత్రం ప్రత్యేక హోమం నిర్వహించారు. చతుస్థానార్చన ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపారు. స్వామివారి సభాస్థానంలో స్వామివారిని పెండ్లి కొడుకు చేసి 33 కోట్ల దేవతలు, 33 కోట్ల పితృదేవతలను 33 రాగాలు, 33 తాళాలు, 33 వేదమంత్రాలతో భూలోకానికి ఆహ్వానించారు. ఇలా ఒక్కో దేవతను మూడు విధాలుగా సంతోష పెట్టి ఆహ్వానం పలికారు. దేవతలందరికీ స్వామివారి దివ్యవిమాన గోపురంలో వసతి సౌకర్యాలు, నైవేద్య కైంకర్యాలను స్వామివారి ద్వారా అర్చకులు అర్పించారు.
33 కోట్ల దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవం పూర్తయ్యే వరకు స్వామివారికి నమస్కరిస్తూ ఉంటారని అర్చకులు తెలిపారు. లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా సాగేలా అనుగ్రహించాలని భగవానుడిని వేడుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి రామకృష్ణారావు, డీఈఓ దోర్భల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడ నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, యాజ్ఞాచార్యులు కిరణ్కుమారాచార్యులు, ముఖ్య అర్చకులు మంగళగిరి నరసింహమూ ర్తి, ఉప ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు, భాస్కరాచార్యులు, మాధవాచార్యులు, సహాయ కార్యనిర్వహణాధికారి రఘు, పర్యవేక్షకులు సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
ప్రధానాలయంలో నిత్యరాధనల అనంతరం సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వా నం, హవనం కార్యక్రమాలను ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృంద సభ్యులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అష్టిదిక్పాలకులను ఆహ్వానించేందుకు రాత్రి భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించారు. భేరీతాడవం మంత్రపూర్వకంగా జరిపారు. శబ్ధబ్రహ్మం, మూలమంత్ర జపంతో ప్రధాన వాయిద్యమైన భేరీని మోగించి కంకణ ధారణ చేశారు.